ఓ చిన్న ఘటన ఆధారంగా తాడిపత్రిలోని ప్రబోధనందాశ్రమ నిర్వాహకులపై జేసి బ్రదర్స్ రెచ్చిపోతున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా తమ ఆశ్రమం ముందునుండి చిన్నపొలమడ గ్రామంలోని ట్రాక్టర్లు వెళ్ళకూడదని ఆశ్రమ నిర్వాహకులు అభ్యంతరం చెప్పిన విషయం ఇపుడు నియోజకవర్గం మొత్తాన్ని ఉద్రిక్తతంలోకి నెట్టేసింది. శనివారం సాయంత్రం ఆశ్రమనిర్వాహకులకు, గ్రామస్తులకు మధ్య జరిగిన గొడవ ఎప్పుడైతే అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాతే పెద్దదైపోయింది.
గ్రామస్తుల్లో తమ మద్దతుదారులుండబట్టే ఎంపి రంగంలోకి దిగారన్నది వాస్తవం. అందుకే ఆదివారం ఉదయం నుండి ఇప్పటి వరకూ జేసి అదే గ్రామంలో పోలీసుస్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేయాలని, వెంటనే ఆశ్రమాన్ని ఖాళీ చేయించి సీల్ వేయాలంటూ జేసి చేస్తున్న డిమాండ్లతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎందుకంటే, ఆశ్రమాన్ని ఖాళీ చేయించటం, నిర్వాహకులను అరెస్టు చేయటమన్నది పోలీసుల శక్తకి మించిన పని. దాంతో ఇరువర్గాల్లో ఎటూ చెప్పలేక పోలీసులు మధ్యలో నలిగిపోతున్నారు. ఘర్షణలకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టటానికి చివరకు పోలీసులు లాఠీచార్జికి దిగటంతో పాటు భాష్పావాయువులు కూడా ప్రయోగించిన విషయం అందరికీ తెలిసిందే.
పరిస్ధితి ఇంతగా దిగజారటానికి కారణం జేసినే అని గ్రహించిన ఆశ్రమంలోని భక్తులు ఒక దశలో ఎంపిపై దాడికి ప్రయత్నించారు. దాంతో భయపడి జేసి అక్కడి నుండి పారిపోయారు. ముందు అక్కడి నుండి పారిపోయిన జేసి వెంటనే తన మద్దతుదారులతో వెనక్కు తిరిగివచ్చి ఈసారి పోలీసుస్టేషన్ ముందు భైఠాఇంచటంతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ధర్నాలో భాగంగా జేసి తమను బూతులుతిట్టినా ఏమీ చేయలేని పరిస్ధితిలో పడిపోయారు పోలీసులు.
ఎప్పుడేమి అవుతుందో అన్న ఆందోళనలతో పోలీసులు ముందుజాగ్రత్తగా ఆశ్రమం చుట్టుపక్కలున్న షాపులను మూయించేశారు. శనివారం సాయంత్రం నుండి జిల్లా ఎస్ప అశోక్ కుమార్ తాగిపత్రిలోనే ఉన్నా పరిస్ధితిలో మార్పు రాలేదు. దాంతో రాయలసీమ ఇన్చార్జి డిఐజి ఘట్టమనేని శ్రీనివాస్ గ్రామంలోనే క్యాంపు వేయటం గమనార్హం. జేసిని చిన్నపొలమాడ గ్రామంలోకి అనుమతించటం వల్లే ఈ పరిస్ధితి దాపురించిందనటంలో సందేహం లేదు. ఇప్పటికైనా జేసి సోదరులను నియంత్రించకపోతే పరిస్దితి ముందు ముందు మరింత దిగజారిపోతుందనటంలో సందేహం లేదు.