చూడబోతే రాజకీయ పరిణామాలు అలాగే అనిపిస్తోంది. కృష్ణా జిల్లా మొత్తం మీద మొదటినుండి విజయవాడ సెంట్రల్ రాజకీయాల్లో అస్ధిరత్వమే ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే, ఇక్కడ ఇద్దరు మాజీ ఎంఎల్ఏల మధ్య టిక్కెట్టు కోసం వివాదం తారాస్ధాయికి చేరుకోవటమే ప్రధానంగా కనిపిస్తోంది. అందులోను గడచిన రెండు రోజులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కేంద్రంగా జరుగుతున్న కీలక పరిణామాలతో త్వరలో వైసిపికి షాక్ తప్పదా అన్న అనుమానం అందరిలోను మొదలైంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మాజీ ఎంఎల్ఏ వంగవీటి రాధా రెడీ అవుతున్నారు. అదే సందర్భంలో టిక్కెట్టుపై హామీతోనే మరో మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు వైసిపిలో చేరారు. చేరిన తర్వాత పార్టీలో చాలా కీలకంగా ఎదుగుతున్నారు. ఎంతలా అంటే రాధాను కూడా విష్ణు డామినేట్ చేసేంతగా. దాంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్ధాయికి చేరుకుంది.
ఈ నేపధ్యంలో రాధాను విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బదులుగా మచిలీపట్నం ఎంపి సీటుపై దృష్టి పెట్టమని సూచన అందింది. దాంతో సెంట్రల్ అసెంబ్లీ టిక్కెట్టు తనకు రాదన్న విషయంలో రాధాకు క్లారిటీ వచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలోని కీలక నేతల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న రాధా అర్ధాంతరంగా వెళ్ళిపోవటం గమనార్హం.
సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిన రాధా తన కుటుంబసభ్యులు, మద్దతుదారులతో సమావేశం పెట్టుకున్నారట. భవిష్యత్ రాజకీయాలపై సలహాల కోసమే రాధా సమావేశం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ రాజకీయాలంటే మచిలీపట్నం ఎంపిగా పోటీ చేస్తారో ? లేకపోతే సెంట్రల్ నుండే పోటీ చేయటానికి ప్రయత్నాలు తీవ్రం చేస్తారో ? అదీ కాకపోతే ఏకంగా వైసిపినే వదిలేస్తారో ఎమీ అంతుపట్టటం లేదు. మొత్తానికి రాధా వైఖరి చూస్తుంటే వైసిపిలో ఉండటం అనవసరమని భావిస్తున్నట్లే కనబడుతోంది.