పశ్చిమ గోదావరిలో ఆయన మాటకు తిరుగులేదు. ఆయన చెప్పిందే వేదం. చేసిందే నాదం. అధికారులకు సైతం చుక్క లు చూపించే నైజం ఆయన సొంతం. ఆయన ఏం చేసినా.. అడిగేవారు ఉండరు. ఆయన ఎవరిపై చేయి చేసుకున్నా ప్రశ్నించేవారే లేరు! ఆయనే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అధికార పక్షం కూడా ఆయన అడుగులకు మడుగులు వత్తుతూనే ఉంది. ప్రభుత్వం ఏ సామాజిక పథకం ప్రవేశ పెట్టినా.. దానిలో తనకు అనుకూలంగా ఆదాయం చూసుకోవడంలో ఎమ్మెల్యే దిట్ట. ఈ క్రమంలోనే 2015లో ప్రభుత్వం ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినప్పుడు తనకు అనుకూలంగా ఈ కార్యక్రమాన్ని మలుచుకున్నాడు.
ఈ నేపథ్యంలో అడ్డు వచ్చిన తహశీల్దార్ వనజాక్షిని సైతం తన మనుషులతో కొట్టించి.. ట్రాన్స్ ఫర్ చేయించాడు. హనుమాన్జంక్షన్లో బస్సులు ఆపినందుకు ప్రశ్నించిన వ్యక్తిని సైతం దగ్గరుండి మరీ కొట్టారు. ఇంకా చెప్పాలంటే దెందులూరులో చింతమనేనే సీఎం... ఆయన వార్నింగ్లతో అక్కడ ఉండలేక నియోజకవర్గానికి దూరంగా ఇళ్లు కట్టుకున్న అధికారులు కూడా ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎదిరించేవారు ఎవరూ లేరా? అనుకునే తరుణంలోనే విపక్షం వైసీపీ నుంచి చిచ్చరపిడుగు మాదిరిగా దూసుకు వచ్చారు కొఠారు అబ్బయ్య చౌదరి. యువకుడు, ఉత్సాహవంతుడే కాదు.. దేశంలోని చట్టాలపైనా.. న్యాయ వ్యవస్థపైనా అవగాహన ఉన్న నాయకుడు కావడంతో ఆచి తూచి అడుగులు వేస్తూ.. చింతమనేనికి ఆగడాలకు చెక్ పెడుతున్నాడు. యువతను సమీకరించి.. స్థానికంగా జరుగుతున్న ఆగడాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాడు. నేరుగా ప్రజల్లోకి వెళ్తున్న కొఠారు స్థానికంగా ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలపై ప్రజలకు వివరిస్తున్నారు.
ఇక, తనదైన శైలిలో,.. పార్టీ అధినేత జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు సంఘీభావంగా దెందులూరులో పాదయాత్ర నిర్వహించి తన సత్తా చాటుకున్నాడు. దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ వాళ్లపై రోజు రోజుకు అక్రమ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఆ పార్టీ నాయకుల ఇళ్లను కూల్చేస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలను ప్రశ్నించే క్రమంలో నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే అవినీతి బాగో తాన్ని ఎండగడుతున్నారు. అబ్బయ్యకు అండగా.. వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ కన్వీనర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి.. సంఘీభావం ప్రకటించారు. తాజాగా ఎమ్మెల్యే దౌర్జన్యాలను నిరసిస్తూ , వాటిని వెలికితీసి ఆయనపై కేసు పెట్టాలని అబ్బయ్య చౌదరి రెండు రోజుల పాటు చేపట్టిన నిరాహార దీక్షకు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని మద్దతు లభించింది. ఇతర జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కన్వీనర్లు పెద్దఎత్తున తరలివచ్చి అబ్బయ్యకు మద్దతు తెలిపారు.
అసలు చింతమనేని ఇలాకాలో వైసీపీకి ఈ రేంజ్లో మద్దతు రావడంతో ఈ ఊహించని పరిణామంతో ఎమ్మెల్యే చింతమనేనికి చుక్కలు కనిపించాయని అంటున్నారు పరిశీలకులు. పైకి గంభీరంగా ఉన్నా.. లోపల చింతమనేనికి చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికి చింతమనేనికి పట్టపగలే చుక్కలు కనిపించడం కొఠారు తొలి విజయంగా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.