రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.. అనేది ఎంత వాస్తవమో.. నేతల తలరాతలు పార్టీ అధినేతల చేతుల్లో ఉంటా యనేది కూడా అంతే వాస్తవం. వరుస అపజయాలతో రాజకీయంగా కుంగిపోయిన విజయవాడ ఒకనాటి బెబ్బులి వంశం వంగవీటి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకు మళ్లీ అశనిపాతం ఎదురైంది. గత ఎన్నికలే కాకుండా తాను చేసిన తప్పిదాలతో వరుసగా 2009, 2014లోనూ ఆయన పరాజయం మూటకట్టుకున్నారు. ఫలితంగా కేడర్ దెబ్బ తినడంతోపాటు.. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వంగవీటికి టికెట్ కష్టాలు ఎదురయ్యాయి.
ఆయన కోరుకున్న సీటు, ఆయనకు పట్టున్న సీటు కాకుండా ప్రాధాన్యం లేని, తనకు సంబంధం లేని మచిలీపట్నం ఎంపీ సీటును జగన్ కేటాయించారనే ప్రచారం సాగుతోంది. నిజానికి వంగవీటికి అసెంబ్లీకి వెళ్లాలనేది ప్రగాఢమైన కోరిక. అయితే, ఆయనను అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పంపాలని జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఏదో మతలబు ఉందని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి 2014లో సెంట్రల్ టికెట్ కోరినప్పుడు వంగవీటి ఆశలను అప్పుడే జగన్ చంపేశాడు. సెంట్రల్ కాదని, తూర్పు నియోజకవర్గం కట్టబెట్టారు. వాస్తవానికి తూర్పులో కమ్మ వర్గం బలం ఎక్కువ. దీంతో అక్కడ గెలుపు సాధ్యం కాదని తెలుసు. అయినా జగన్ వంగవీటికి దీనిని అప్పగించారు. ఫలితంగా ఆయన ఘోరంగా ఓడిపోయారు.
నాడు తనకు సమీప బంధువు అయిన పూనూరు గౌతంరెడ్డికి సెంట్రల్ సీటు ఇచ్చేందుకు జగన్ రాధాను తూర్పుకు పంపడంతో అక్కడ ఆయన ఓటమి పాలవ్వక తప్పలేదు. ఆ తర్వాత రాధా తిరిగి సెంట్రల్ సీటుకు మారారు. ఇక, ఇప్పుడు కూడా వంగవీటి కోరుతున్న సెంట్రల్ నియోజకవర్గం కాదని, ఎక్కడో మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇదంతా జగన్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. 2009 ఎన్నికల సమయంలో అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి.. అప్పుడే పుట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేశారు. అయితే, ఆ సమయంలో సీఎంగా ఉన్న వైఎస్ వంగవీటికి వద్దకు రాయబారులను పంపారు.
సాక్షాత్తూ ఉండవల్లి అరుణ్కుమార్తోనూ ఫోన్ చేయించి.. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది.. నీకు మంచి అవకాశం కూడా దక్కుతుంది అని హామీ ఇచ్చారు. అయినా కూడా వంగవీటి రాధా పెడచెవిన పెట్టి వైఎస్ మాటను కాదని ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఘోరంగా ఓడిపోయారు. దీంతో వైఎస్ను ధిక్కరించాడనే పేరు వంగవీటిపై పడింది. ఈ కారణంగానే వంగవీటి మాటకు జగన్ విలువ ఇవ్వడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇది నిజమే అయితే.. చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఇప్పటకీ రాధా తన తండ్రి రంగా బ్రాండ్ చెప్పుకునే రాజకీయాలు చేస్తున్నారని... పార్టీ కోసం కష్టపడడం కాని.. జనాల్లోకి వెళ్లడం కాదని చేయడం లేదన్న రిపోర్టులు కూడా జగన్ వద్దకు చేరాయట. ఈ క్రమంలోనే జగన్ రాధాను పక్కన పెట్టేందుకు ఆయన్ను సెంట్రల్ నుంచి తప్పించేసి.... మచిలీపట్నం ఎంపీగా పంపాలనే ప్లాన్ వేశారని తెలుస్తోంది.