ఏపీ ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర విశాఖపట్టణం జిల్లాలో సాగుతోంది. జోరు వాన లో కూడా ప్రజా సమస్యల కోసం జగన్ ఏ మాత్రం ఆగకుండా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పై చేసిన కామెంట్లు ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యాయి.
భీమిలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆ నియోజకవర్గ ప్రజలు తనను కలిసి అనేక విషయాలు చెప్పారని ఈ సందర్భంగా తెలియజేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు భూకబ్జాల తో దోపిడి చేస్తున్నారని..హుద్ హుద్ తుపానులో ఏకంగా రికార్డులు కొట్టుకుపోయాయని చెప్పేశారని ఆయన అన్నారు.
ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న చరిత్ర కూడా మంత్రిదని ఆయన అన్నారు.లాండ్ పూలింగ్ పేరుతో కూడా చినబాబు తో కలిసి ఆయా చోట్ల అస్సైన్డ్ భూములను పావలా రేటుకు భయపెట్టి కొనుగోలు చేసి,ఆ తర్వాత లాండ్ పూలింగ్ నోటీసులు ఇప్పిస్తారని జగన్ అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు..మంత్రి గంటా శ్రీనివాసరావు అవినీతికి అంబాసిడర్ లు అని ఎద్దేవా చేశారు జగన్. అలాగే మంత్రిగారి వియ్యంకుడు మరో మంత్రి అయిన నారాయణ... కార్పొరేట్ కాలేజీలు పెట్టి చదువును వ్యాపారం చేశారని... అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.