ఎదుటి పార్టీ వారు మనకు కరడుగట్టిన ప్రత్యర్థులే అయినా కూడా.. వారిలోనూ మంచి లక్షణాలుంటే దొంగ చాటుగా అయి నా అనుకరించడంలో తప్పులేదని అన్నారు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ! ఇప్పుడు ఇలాంటి మంత్రాన్ని జగన్ పాటిస్తే బెటరేమో?! అంటున్నారు విశ్లేషకులు. మంచి ఎక్కడున్నా తీసుకుంటే తప్పులేదని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో మరో ఏడెనిమిది మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీల్లోని నేతలు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అలకలు ఇప్పుడిప్పుడే స్టార్టయ్యాయి. ఇక, బెదిరింపులు, హెచ్చరికలు కూడా మరికొద్ది రోజుల్లోనే వెలుగు చూడనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితిఇలానే ఉంది కదా? అక్కడ 105 మంది అభ్యర్థులను అధికార పార్టీ ప్రకటిస్తే.. వాటిలో పేరు లేనివారు ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరిస్తున్నారు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ప్రధానంగా రెండు పార్టీలైన టీడీపీ, వైసీపీల మధ్యే పోరు సాగనుంది. పవన్ ఉన్నా.. ఆటలో అరటి పండు మాదిరిగానే మిగిలిపోతాడని చెబుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. టికెట్ల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అయితే, ఈ విషయంలో పలు స్థానాలనే నమ్ముకుని ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించిన నేతలను బుజ్జగించడంలోను, వారితో చర్చించి టికెట్లను వేరేవారికి ఇస్తున్నట్టు చెప్పడం లోనూ జగన్ విఫలమవుతున్నారు. కిందపడ్డా పైచేయినాదే అనడంలో పెద్దమనిషిగా ఉన్న జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అందరి సహకారం ఉండితీరాలని, టికెట్ దక్కనివారు కూడా పార్టీకి పనిచేసేలా ఆయన కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతున్నారు.
దీంతో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మర్రి రాజశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట బాలకృష్ణ, కర్నూలు జిల్లా పాణ్యం గౌరు చరితా రెడ్డి, విజయవాడ సెంట్రల్ వంగవీటి రాధా వంటి వారికి టికెట్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు జగన్వారిని బుజ్జగించే ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ, ఆయన తన బెట్టు వీడకుండా.. నేను సీతయ్యను అనే టైపులో వ్యవహరించడంతో ఆయా నియోజకవర్గాల్లో బలంగా వీరంతా జగన్పై తిరుగుబాటు బావుటాకు రెడీ అయ్యారు.
కానీ, అదేసమస్య అధికార టీడీపీ అధినేత చంద్రబాబుకు మరింత ఎక్కువగా ఉంది. అవినీతిలో కూరుకుపోయిన సిట్టింగులను మార్చాలని ఆయన భావిస్తున్నారు. అయితే, వారికి ముక్కుమీద గుద్దినట్టు కాకుండా తనవద్దకు పిలిపించుకుని సమస్యలు వివరించి వారు సంతృప్తి పడేలా.. వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వారంతా కూడా టికెట్ రాకపోయినా చంద్రబాబుకు సహకరించేందుకు తలాడిస్తున్నారు. ఇలా చంద్రబాబు ఇప్పటికే మొత్తం 30 మందిని అమరావతికి పిలిపించుకుని మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి ఇలాంటి వాతావరణం జగన్ ఎప్పుడు కల్పిస్తారు?!!