చంద్ర బాబు సర్కార్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన ప్రజల మీద కేసులు బనాయించిన సంగతీ తెలిసిందే. అయితే ఈ ఔదార్యం కూడా చంద్రబాబు వ్యూహమే తప్ప... నిజాయితీ కాదనే వ్యాఖ్యలుకూడా వినిపిస్తున్నాయి. ఈ కేసుల ఎత్తివేత వ్యవహారంలోనూ రకరకాల మడత పేచీలు పెడుతుండడం కూడా విమర్శలకు గురవుతోంది.చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తొలినాటినుంచి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని, ప్రజల్లో దానికోసం రగులుతున్న స్ఫూర్తిని నీరుగారుస్తూనే వచ్చారు.
ప్రత్యేకహోదా జిందా తిలిస్మాత్ కాదు.. దానివల్లనే అన్ని పనులూ అయిపోతాయని అనుకోవడం భ్రమ.. అంటూ ప్రజలను మభ్యపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రాబు మాటల మీద ఎలాంటి విశ్వాసమూ లేని ప్రజలు... ఆ మాటలను నమ్మకుండా, చంద్రబాబు మీద ఆశ వదలుకుని.. తమంతట తాము ప్రత్యేకహోదా కోసం తమకు చేతనైనంత వరకు ఉద్యమాలు చేశారు. అలా ఉద్యమాలకు దిగిన వారందరి మీద చంద్రబాబు సర్కారు విపరీతంగా పోలీసు కేసులు నమోదు చేసింది. వారిని ఇబ్బందులు పెడుతోంది.
ప్రత్యేకహోదా కోసం ఉద్యమించిన వారి మీద కేసులు ఎత్తేయాలంటూ.. విపక్షాలు, తటస్థంగా ఉండే మేధావులు.. అనేక వర్గాల వారు పలుమార్లు విన్నవించినప్పటికీ చంద్రబాబు ఎన్నడూ పట్టించుకోలేదు. ఒకవైపు హోదాకోసం ప్రజాఉద్యమాలు జరుగుతున్న రోజుల్లోనే ఆయన ప్యాకేజీకోసం ఒప్పందం చేసుకున్నారు. ప్యాకేజీ మహాద్భుతం అంటూ ప్రజలను వంచించే ప్రయత్నం చేశారు. తీరా ఇప్పుడు తాను ప్రత్యేకహోదా ఉద్యమం- పోరాటం పేరుతో సరికొత్త డ్రామాను ప్రారంభించిన తర్వాత.. దానికి ప్రజల్లో విలువ ఉండదనే ఉద్దేశంలోనే హోదా కేసులు ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.