జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజాసంకల్పయాత్ర త్వరలో రికార్డు సృష్టించబోతోంది. ఈనెల 24వ తేదీన విజయనగరం జిల్లాలోని కొత్తవలస దగ్గరలోని దేశపాత్రునిపాలెం వద్ద జగన్ పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తుంది. ఆ సందర్భంగా అక్కడే భారీ బహిరంగసభ నిర్వహణకు పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఓ పైలాన్ ను కూడా 3 వేల కిలోమీటర్లకు గుర్తుగా ఏర్పాటు చేస్తున్నారు.
ఇదే విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద జగన్ లాగ ప్రజాధరణ ఉన్న నేత ఇంకోరు లేరన్నారు. ప్రజాదరణలో జగన్ ఇప్పటికే ఘన విజయం సాధించినట్లు చెప్పారు. పాదయాత్ర మొదలైన దగ్గర నుండి ఊర్లకు ఊర్లే కదిలివస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర చేయటం ద్వారా చంద్రబాబునాయుడు పరిపాలనకు వైఎస్ ఎలా చరమగీతం పాడారో ఇపుడు జగన్ కూడా అదే విధంగా చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకూ జగన్ 116 నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసినట్లు చెప్పారు. 193 మండలాల్లోని 1650 గ్రామాల్లో పాదయాత్ర జరిగిందన్నారు. అదే సందర్భంలో 44 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కూడా పాదయాత్రలో కవర్ అయ్యిందన్నారు. 106 సభలు, 41 సమావేశాలు జరిగినట్లు తెలిపారు. 269వ రోజు జగన్ పాదయాత్ర 3 వేల కిలోమీటర్లను అధగమిస్తుందన్నారు.