కాలానుగుణంగా రంగులు మార్చుకోవటం ఊసరవెల్లులకు సహజం. ప్రకృతిసిద్దంగా వాటికి ఆ లక్షణం అబ్బింది. శతృవులనుండి తమను తాము రక్షిచు కోవటానికి ప్రకృతి చేసిన ఏర్పాటు. మరి మనుషులు కూడా అదే విధంగా కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మాటలు మార్చేస్తుంటే ఏమంటారు. వారిని కూడా ఊసరవెల్లులు అంటారు. రాజకీయ నేతల్లో మిగిలిన వారి సంగతి ఎలాగున్న ఏపి రాజకీయాల్లో మాత్రం అటువంటి లక్షణాలున్న వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఊసరవెల్లులు ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటే ఈయనగారు మాటలు మారుస్తున్నారంతే తేడా.
ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ తానెపుడూ ఏపికి ప్రత్యేకహోదా వద్దని అనలేదట. ఎక్కడైనా అలా అనుంటే చూపాలంటూ సవాలు విసరటంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో జనాలందరూ ప్రత్యేకహోదా కావాలని ముక్తకంఠంతో నినదించినపుడు ఒక్క చంద్రబాబు మాత్రమే ప్రత్యేకహోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీనే ముద్దని ఎన్నో సార్లు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజికి మద్దతుగా చంద్రబాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగులు కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి.
అలాగే, ప్రత్యేకహోదాపై యువతను జాగృతం చేయటానికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యువభేరిలు నిర్వహిస్తే సభలకు హాజరయ్యే వారిని అరెస్టు చేయిస్తానంటూ బహిరంగంగా హెచ్చరించింది ఇదే చంద్రబాబు. జగన్ సభలకు పిల్లలను పంపితే చెడిపోతారుని తల్లి, దండ్రులకు హితబోధ చేసిన విషయం చంద్రబాబు మరచిపోయారేమో ?
అలాగే ఎన్డీఏలో ఉన్నపుడు మోడిని, కేంద్రప్రభుత్వాన్ని ఎంతలా పొగిడారో అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండి పొగిడిన నోటితోనే ఇపుడు తిడుతున్నారు. కేంద్ర సాయంతో దేశంలో ఏపినే నెంబర్ వన్ గా అభివృద్ధి చెందుతోందన్న నోటితోనే ఏపి అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతోందని ఇప్పుడంటున్నారు. .
రాష్ట్రాభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి చెబుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ప్రధాన ప్రతిపక్షం వైసిపి అడ్డుకుంటోందని ప్రతీ వేదిక మీదా మండిపోతుంటారు. ఎవరొచ్చినా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం ఆగదని చెప్పిన నోటితోనే ప్రాజెక్టులను ప్రతిపక్షం అడ్డుకుంటోందని మరోసారి అంటారు. ఇలా ..ఒకటికాదు, రెండు కాదు. లెక్కలేనన్ని ఉదంతాలున్నాయి చంద్రబాబు ఊసరవెల్లి తనం గురించి చెప్పుకోవటానికి. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్దీ చంద్రబాబు నోటి నుండి ఇటువంటి ఆణిముత్యాలు ఇంకెన్ని వినాలో ?