తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. పలువురు నేతల రాజకీయ భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. తాను ముందు నుంచే చెప్పినట్టుగానే దాదాపుగా సిట్టింగులకే టికెట్లు కేటాయించి.. అందరి ఊహాగానాలకు చెక్ పెట్టారు. తాను అన్నమాటపై నిలబడుతానని.. ఇప్పుడు అదే చేశానని కేసీఆర్ అన్నారు. అయితే.. పలు స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను చూస్తే మాత్రం.. ఇలా అయితే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మంత్రికి సహితం కేసీఆర్ టికెట్ ప్రకటించి, అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సారి ఆ మంత్రికి టికెట్ రాదనీ.. తన కుమారుడికి లేదా మరెవరికైనా కేసీఆర్ ఇస్తారనే ప్రచారానికి కేసీఆర్ చెక్ పెట్టారు.
అయితే.. ఆ మంత్రి మరెవరో కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజవకర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న అజ్మీరా చందూలాల్. నిజానికి ఆయన గత ఎన్నికల తర్వాత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధ్యలోనే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి, మరొకరిని తీసుకుంటారనే టాక్ వినిపించింది. అయినా.. పర్యాటక శాఖా మంత్రిగా కేసీఆర్ ఆయననే కొనసాగించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పించి, మరొకరికి టికెట్ ఇవ్వడం మాత్రం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇది కూడా ఉత్తి పుకారేనని కేసీఆర్ తేల్చిపడేశారు. ఈసారి కూడా ములుగు నుంచి చందూలాల్కే టికెట్ ఇచ్చి.. ఆందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. అయితే.. ఈ విషయంలో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో మంత్రి కుమారుడు ప్రహ్లాద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఇప్పుడు నియోజకవర్గంలోని క్యాడర్ కూడా చందూలాల్ టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు.. టికెట్లు ఆశించిన పలువురు ఆశావాహులు కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి అనారోగ్యం దృష్ట్యా ఆయనకు టికెట్ ఇవ్వొద్దనీ.. ఇతరులకు ఇవ్వాలని, అది కూడా ఆదివాసీ గిరిజనులకు ఇవ్వాలనే డిమాండ్ ముందుకు వస్తోంది.
ఇటీవల ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా పార్టీ పెద్దలకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ తన నిర్ణయం మార్చుకోకుంటే మాత్రం ప్రతికూల ఫలితం తప్పదనే టాక్ పార్టీవర్గాల్లోనే వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉండడంతో.. ఆ వర్గానికి ప్రాధాన్యం ఇస్తేనే.. పార్టీకి మంచిదని పలువురు నాయకులు అంటున్నారు. ఈ విషయంలో చివరికి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి మరి