మొత్తానికి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాధించినట్లే ఉన్నారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకోనున్నారు. సమన్వయకర్తగా ఆనం నియమిస్తు పార్టీ అధిష్టానం నుండి ఆదేశాలు వచ్చినట్లు ఆనం మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గం కేంద్రంగా జిల్లా రాజకీయాలు చాలా కాలంపాటు రవసత్తరంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేయటమే లక్ష్యంతో ఆనం పార్టీలో చేరాలని అనుకున్నారు.
అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి కొడుకు, బిజెపి నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా వైసిపిలో చేరాలని అనుకున్నారు. వీరిద్దరు కాకుండా ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు కూడా టిక్కెట్టు కోసం పోటీ పడ్డారు. ఇంతమంది ఒక్కసారిగా వెంకటగిరి నియోజకవర్గంపై కన్నేయటంతో జిల్లా రాజకీయాలు వేడెక్కిపోయాయి.
ఇటువంటి నేపధ్యంలో అందరితో జగన్మోహన్ రెడ్డి విడివిడిగా మాట్లాడారు. తర్వాత ఆనం విశాఖపట్నంలో వైసిపిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు నేదురుమల్లి కూడా వైసిపి ఫ్యాన్ కండువా కప్పుకున్నారు. దాంతో టిక్కెట్టు అవకాశం వీరిద్దరిలోనే ఉంటుందని ప్రచారం మొదలైంది. తర్వాత జరిగిన పరిణామాల్లో నేదురుమల్లికి విశాఖపట్నం లోక్ సభ టిక్కెట్టు ఇవ్వటానికి జగన్ అంగీకరించారనే ప్రచారం మొదలైంది.
ఇవన్నీ ఇలా ఉండగానే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం త్వరలో బాధ్యతలు తీసుకుంటున్నారు. దాంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆనం మద్దతుదారుల్లో హుషారు పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి టిక్కెట్టు ఆనంకే అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో వెంకటగిరి సస్పెన్స్ వీడిపోయినట్లే అని అనుకుంటున్నారు.