మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం మరవకముందే.. హైదరాబాద్ నడిబొడ్డున మరో కులోన్మాద ఘటన జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే ఈ కథలో కూడా తండ్రే విలన్ గా మారాడు. హైదరాబాద్లో కన్న కూతుర్ని కత్తితో తెగ నరికిన మనోహరాచారి...ఆ ఆయుధాన్ని ఓ కొబ్బరి బోండాల షాపు దగ్గర చోరీ చేశాడు.
ఎర్రగడ్డలో కూతురు మాధవి, అల్లుడు సందీప్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో మాధవి అనే యువతిపై ఆమె కన్నతండ్రి మనోహరాచారి కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మనోహరాచారి గురించి తాజాగా ఓ ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. మనోహరాచారి గత చరిత్రలో ఫ్యాక్షన్ కోణం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన మనోహరాచారి 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చాడు.
కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ నాయకులకు అనుచరుడిగా తిరిగిన మనోహరాచారి, ఆర్థికంగా చాలా చితికిపోయాడు. ప్రస్తుతం అతని భార్య కూడా చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఎదిగొచ్చిన కుమారుడు కూడా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు.
ఇలా అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో.. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం చారి కుటుంబం సహించలేక పోయింది. అందుకే కూతురితో సఖ్యతగా ఉన్నట్టు నటిస్తూనే.. బట్టలు కొనిస్తానంటూ ఆమెను పిలిపించి.. కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కుమార్తె ప్రేమ వివాహం ఆయనను రాక్షసుడిగా మార్చింది.