కాంగ్రెస్ పార్టీ అంటేనే పూర్తి ప్రజాస్వామ్యానికి చిరునామా. ఎవరు ఎవరినైనా విమర్శిస్తారు మళ్ళీ టిక్కెట్లు తెచ్చుకుంటారు. అదే కాంగ్రెస్ లోని గ్రేట్ నెస్. ముందస్తు ఎన్నికల వేడిలో ఉన్న కాంగ్రెస్ లో ఇపుడు జరిగిందదే. నల్గొండ జిల్లా నేత, పిసిసిలో సీనియర్ అయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏఐసిసిలో తెలంగాణా ఇన్చార్జి కుంతియాతో పాటు పిసిసిలు పలువురు నేతలను పేర్లు చెప్పకుండా అమ్మనాబూతులు తిట్టారు. మునుగోడు నియోజకర్గంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పలువురు నేతలపై నానా మాటలన్నారు. దానిపై పిసిసి కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఇపుడా అంశం హాట్ టాపిక్ అయిపోయింది.
ఆ విషయంపైనే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలు మాట్లాడిన తనకు షోకాజ్ ఇవ్వటం సబబుకాదన్నారు. తన మాటలను పార్టీ భవిష్యత్తు కోసం చేసిన సూచనలుగా తీసుకోవాలన్నారు. గాంధి భవన్లో కూర్చుని పోస్టులమ్ముకునే వాళ్ళు తనకు షోకాజ్ నోటీసు ఇవ్వటమేంటంటూ ఎదురు ప్రశ్నించారు. తానంటే పడని కొందరు నేతలు తనను పార్టీ నుండి బయటకు పంపేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాను పార్టీలో నుండి బయటకు వెళ్లిపోతే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
కాంగ్రెస్ ను అధికారంలొకి తీసుకురావటానికి తమలాంటి వాళ్లను ఉపయోగించుకోవాలని రాజగోపాల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా పోటీ చేస్తానంటే ఎలాగంటూ నిలదీశారు. పార్టీ బాగుకోసం కష్టపడి పనిచేసిన తనలాంటి వాళ్ళను పక్కన పెట్టేయటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే స్ధాయి పిసిసిలో ఎవరికైనా ఉందా అంటూ నిలదీయటం నిజంగా ఆలోచించాల్సిందే.