వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బ్లాక్ మెయిల్ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లే కనబడుతోంది. ఆయన స్ధాయికి మించి మాట్లాడుతున్నట్లే అనుమానంగా ఉంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా ఉన్న కుటుంబరావు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాల గురించి మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే, ఆయన రాజకీయనేత కాదు. తెలుగుదేశంపార్టీతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. అటువంటిది ఆయన తన పరిధి దాటి రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం విచిత్రంగా ఉంది.
తాజాగా జగన్ పై చేస్తున్న ఆరోపణలు, గతంలో నరేద్రమోడిపై చేసిన ఆరోపణలు కూడా అలాగే కనిపిస్తోంది. అప్పట్లో బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావుతో కుటుంబరావుకు వాగ్వాదం జరిగినపుడు కూడా జివిఎల్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని స్దితిలో చర్చను పక్కదారి పట్టించారు. అందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ కుంభకోణం చేసుకుంటున్నట్లు ఆరోపించారు. నెలరోజుల్లో మోడి బండారమంతా బయటపెడతానంటూ కుటుంబరావు చేసిన బెదిరింపులు గుర్తుండే ఉంటుంది. మరి ఏం జరిగిందో తెలీదు కానీ ఆయన చెప్పిన కుంభకోణాలేవి బయటకు రాలేదు.
మళ్ళీ ఇపుడు కూడా అదే తరహాలో జగన్ పై ఆరోపణలు మొదలుపెట్టారు. అమరావతి బాండ్ల కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవకతవకలపై వైసిపి చంద్రబాబునాయుడుపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే . ఆ ఆరోపణలకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేక కుటుంబరావును రంగంలోకి దింపింది. కుటుంబరావు మాట్లాడుతూ త్వరలో జగన్ అవినీతిని బయటపెడతానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. జగన్, ఆయన కంపెనీలకు సంబంధించిన బండారాన్ని త్వరలో బయటపెడతానంటున్నారు.
కుటుంబరావు ఇపుడు కొత్తగా జగన్ , కంపెనీల బండారాన్ని బయటపెట్టటమేంటో ఎవరికీ అర్దం కావటం లేదు. జగన్ పైన, ఆయన కుటుంబాలపైన ఇడి, సిబిఐ తదితర దర్యాప్తు సంస్ధలు దర్యాప్తు చేస్తూనే ఉన్నాయి. జగన్ పై కేసులు పెట్టి ఇప్పటికీ కోర్టులు చుట్టూ తిప్పుతునే ఉన్న విషయం అందరూ చూస్తున్నదే. అంటే జగన్ కు సంబంధించిన వ్యాపార సంస్దలు, కంపెనీలన్నింటిపైనా దాదాపు ఎనిమిదేళ్ళుగా దర్యాప్తు జరుగుతునే ఉన్నాయి. ఈ దర్యాప్తును కాదని కుటుంబరావు కొత్తగా బయటపెట్టే బండారం ఏముంటుంది ?
ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో పోయిన ఎన్నికల్లో మాదిరే జగన్ అత్యంత అవినీతిపరుడని, లక్ష కోట్లు దోచుకున్నాడనే ఆరోపణలకు టిడిపి మళ్ళీ పదును పెడుతోంది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో జగన్ పై చేయటానికి చంద్రబాబు అండ్ కో కు కొత్త ఆరోపణలేవీ ఉన్నట్లు లేవు. చేయాల్సిన ఆరోపణలన్నింటినీ పోయిన ఎన్నికల్లోనే చేసేశాయి. కాబట్టి ఇపుడు బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నట్లే అనుమానంగా ఉంది. విచిత్రమేమిటంటే జగన్ పాదయాత్రకు జనాలు విపరీతంగా స్పందిస్తుంటే జనాలు రావటం లేదనే వైసిపి బుడబుక్కల కథలు వినిపిస్తోందంటూ కుటుంబరావు ఉడుక్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.