అమెరికాలోని ప్రవాసాంధ్రుల ఓట్ల కోసమే చంద్రబాబునాయుడు అమెరికాకు వెళ్ళారా ? చూడబోతే విషయం అంతేలాగుంది. చెప్పిందేమో ప్రభుత్వ కార్యక్రమం. చేస్తున్నదేమో తెలుగుదేశంపార్టీకి ప్రచారం. అత్త సొమ్ముతో అల్లుడు షోకులన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం. ఏపికి పెట్టుబడులు ఆకర్షించటానికి, ఐక్యరాజ్యసమితిలో ప్రకృతి సేధ్యంపై ప్రసంగించాటానికి తాను అమెరికా వెళుతున్నట్లు చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ అమెరికాలోని న్యూయార్క్ లో ఈరోజు ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశం సమావేశం చూస్తే అలా అనిపించటం లేదు.
ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలంటూ ఓ మొక్కుబడి విజ్ఞప్తి చేసిన తర్వాత చంద్రబాబు మాట్లాడిందా రాజకీయాలే. పెట్టుబడులు పెట్టేవారికి అన్నీ విధాలుగా సహకరిస్తామంటూ ఎప్పుడూ వినిపించే రికార్డునే వినిపించారు. పోలవరం ప్రాజెక్టును 58 శాతం పూర్తి చేశామని చెప్పుకున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో 58 శాతం పనులు కాలేదు. అంతుకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో జరిగిన చాలా పనులను కలుపుకుని మొత్తం తన హయాంలోనే జరిగినట్లు చంద్రబాబు చెప్పుకున్నారు.
పైగా ఈ ఏడాది ఓటు హక్కు వచ్చే వారందరూ అమెరికా నుండి ఓటు వేయొచ్చని, అందరూ టిడిపికే ప్రచారం చేసి ఓట్లు వేయించాలని విజ్ఞప్తి చేయటం విడ్డూరంగా ఉంది. అప్పటికి అమెరికాలోని ఏపి జనాలందరూ తన మనుషులే అన్నంతగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ పార్టీ వల్ల పైకి వచ్చామో అన్న విషయాన్ని అందరూ గుర్తుకుపెట్టుకుని టిడిపికి ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని ఓ సెంటిమెంటు ప్రయోగించారు. అమెరికాలో ఉన్న వారంతా టిడిపి ఎన్ఆర్ఐ విభాగంలో సభ్యులై పార్టీకి ప్రచారం చేయాలని చెప్పుకోవటం విచిత్రంగా ఉంది. ప్రపంచ దేశాల్లో టిడిపి జెండా రెపరెపలాడుతుందని ఎవరూ ఊహించలేదని చెప్పటం విశేషం. ప్రపంచ దేశాల్లో టిడిపి జెండా ఎందుకు ? ఎలా ? రెపరెపలాడిందో మాత్రం చెప్పలేదు లేండి.