వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరి కొద్ది సేపట్లో గిన్నిస్ రికార్డును క్రియేట్ చేయబోతున్నారు. ఎందులో అంటే పాదయాత్రలోనే. పోయిన నవంబర్ 6వ తేదీన కడప జిల్లా పులివెందులలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఈరోజు ఉదయం విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో అడుగుపెట్టటం ద్వారా 269వ రోజు 3 వేల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించబోతున్నారు. 11 జిల్లాల్లో పూర్తి చేసుకుని 12వ జిల్లా విజయనగరంలోకి డుగుపెడుతున్నారు.
ఇప్పటి వరకూ 116 నియోజకవర్గాలు కవర్ చేశారు.
ప్రజా సమస్యలను దగ్గర నుండి చూడటం కోసం, జనాలను నేరుగా కలుసుకునే ఉద్దేశ్యంతో మొదలైన సుదీర్ఘ పాదయాత్ర నిజంగా దేశంలో ఓ అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే, ఇంత వరకూ దేశంలో ఎవరు కూడా ఇంతటి సుదీర్ఘమైన పాదయాత్రను చేయలేదు.
ఉమ్మడి ఏపిలో కూడా మొదట చేవెళ్ళలో దివంగత ఎంఎల్ఏ, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మొదలుపెట్టారు. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. వైఎస్ నడిచింది 1500 కిలోమీటర్లే. ఆ పాదయాత్రే వైఎస్ ను ముఖ్యమంత్రిని చేసిందనే చెప్పాలి.
తర్వాత జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేశారు. తన పాదయాత్రలో షర్మిల 14 జిల్లాల్లో 224 రోజుల నడవటం ద్వారా 107 నియోజకవర్గాలను కవర్ చేశారు. మొత్తం 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తర్వాత చంద్రబాబునాయుడు కూడా వస్తున్న మీకోసం అనే పేరుతో 2012, అక్టోబర్- 2013 జనవరి 26 మధ్య పాదయాత్ర చేశారు.
పాదయాత్ర అనే పేరే కానీ మధ్యలో కొంత భాగం వ్యాన్ లో పూర్తి చేశారు. తన పాదయాత్రలో 208 రోజులు నడిచి 2340 కిలోమీటర్లు కవర్ చేశారు. 65 ఏళ్ళ వయస్సులో చంద్రబాబు అన్ని వేల కిలోమీటర్లు నడవటం గొప్పే. చంద్రబాబు కూడా పాదయాత్ర చేసిన తర్వాత 2014లో సిఎం అయ్యారు.
ఇక ప్రస్తుతానికి వస్తే జగన్ ఏకంగా 3500 కిలోమీటర్ల దూరం పాదయాత్రలో కవర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు 3వేల కిలోమీటర్లను అధిగమిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయనున్నారు.
అంటే అది ఒకరకంగా గిన్నెస్ వరల్డ్ రికార్డనే చెప్పాలి. వైఎస్ కానీ, చంద్రబాబు కానీ పాదయాత్ర చేసిన తర్వాతే ముఖ్యమంత్రులయ్యారు. మరి, ఇపుడు జగన్ కూడా పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత జరగబోయే ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రకారం ముఖ్యమంత్రి అవుతారా ?