కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి బెయిల్ మంజూరైంది. తమ నేతకు బెయిల్ మంజూరైందంటే జగ్గారెడ్డి మద్దతుదారులకు, అభిమానులతో పాటు కాంగ్రెస్ నేతలకు కూడా గుడ్ న్యూసే కదా ? మానవ అక్రమ రవాణా కేసులో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం అందరికీ తెలిసిందే. 15 రోజుల తర్వాత సికింద్రాబాద్ కోర్టు మాజీ ఎంఎల్ఏకి బెయిలిచ్చింది.
ప్రస్తుతం చంచల్ గూడ్ జైల్లో ఉన్న జగ్గారెడ్డి ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశలున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. 2004లో నకిలీ పాస్ పోర్టులతో, పత్రాలతో ముగ్గురు గుజరాతీయులను జగ్గారెడ్డి తన భార్య, పిల్లలుగా చెప్పి అమెరికా పంపించారన్నది అభియోగం. మరి 14 ఏళ్ళ క్రితం కేసులో ఇంతకాలం పోలీసులేం చేస్తున్నారు ? ఇపుడే ఎందుకు అరెస్టు చేశారని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేరు. ముందస్తు ఎన్నికల హీట్ లో భాగంగా టిఆర్ఎస్ పార్టీనే తమ నేతను అక్రమంగా ఇరికించి అరెస్టు చేయించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం గమనించాలి.
మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలోనే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయటం పెద్ద చర్చకే దారితీసింది. సంగారెడ్డిలో కాంగ్రెస్ తరపున జగ్గారెడ్డి బలమైన అభ్యర్ధి అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆయనకు బెయిల్ రాకపోతే ఆయన భార్య, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నిర్మల ను పోటీలోకి దింపాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, జగ్గారెడ్డికి బెయిల్ రావటంతో కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే, పోలీసులు జగ్గారెడ్డిని ఎప్పుడైన మళ్ళీ అరెస్టు చేసే అవకాశం ఉంది మరి.