ఆంధ్రప్రదేశ్ లో ప్రజల హృదయాలు గెల్చుకున్న ముఖ్యమంత్రులు అతి తక్కువ మంది ఉన్నారు..వారిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరుపు నుంచి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రాజశేఖర్ రెడ్డి. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పటికే ఆయన వారసుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై సమరశంఖారావం మోగించాడు. ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి తండ్రి బాటలోనే పాద యాత్ర మొదలు పెట్టారు. ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా జగన్ వెళ్లిన ప్రతిచోటా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. తమ రాజన్న మళ్లీ తమ ముందుకు వచ్చాడని ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా జగన్ ని చూడటానికి వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు.
ఆయన నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర ఇవాళ్టీకి 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 269వ రోజు పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 269 రోజులు.. 116 నియోజకవర్గాలు.. 106 బహిరంగ సభలు..11 జిల్లాల మీదుగా సాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ వస్తుంది.
ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తుందని..ఇదంతా ప్రజలకు తనకు ఇస్తున్న నైతిక బలం అని..ప్రజల ఆశిస్సులే తన పాదయాత్రకు బలం అని..ప్రజల కోసం తాను ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నానని...తన తండ్రిబాటలో నడుస్తూ ప్రజల ఆదరణ ఆప్యాయత చూరగొన్నానని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు.