చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ దుమ్ము దులిపేశారు. ప్రభుత్వ పథకాల్లోని అవినీతితో పాటు గోదావరి పుష్కరాల్లో మృతులపై సోమయాజుల కమీషన్, పోలవరం ప్రాజెక్టు, కిడారి హత్యపై ఎస్ఐ సస్పెన్సన్ తదితరాలపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. ముష్టివాడిని కూడా దోచుకునేట్లుగా తయారైందన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం తయారైందంటూ ఉండవల్లి ఎద్దేవా చేయటం గమనార్హం.
చంద్రబాబు హయాంలో కాంట్రాక్టర్లు, ప్రభుత్వం ఒకటిగా కలిసిపోయినట్లు మండిపడ్డారు. ప్రతీ విషయంలోను ఓపెన్ గా చాలెంజ్ చేసే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్న క్యాంటిన్లు, ఆదరణ, పోలవరం ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమా అంటూ చాలెంజ్ చేయటం గమనార్హం. ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి పెరిగిపోయందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక కుటుంబరావు సలహాలుంటాయని ఉండవల్లి స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు,ఇంజనీర్ల లాంటి నిపుణులు చెప్పాల్సిన విషయాలను కూడా కుటుంబరావే మాట్లాడేస్తుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఒక ముష్టి వాడిని దోచుకోవాలని సామాన్యంగా ఎవరికీ అనిపించదని కానీ చంద్రబాబు ప్రభుత్వం అంతకన్నా అధ్వాన్నంగా తయారైందంటూ ధ్వజమెత్తారు. ఐక్య రాజ్యసమితిలో చంద్రబాబు మాట్లాడినట్లు చెప్పుకోవటాన్ని కూడా ఉండవల్లి ఎద్దేవా చేశారు. పోలవరంతో పాటు పలు పథకాల్లో జరుగుతున్న అవినీతిని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్దారించినా ప్రభుత్వం వైపు నుండి ఎవరూ మాట్లాడకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ ఉండవల్లి స్పష్టం చేశారు.