తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ కు ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి ఎంఎల్ఏ విశ్వేశ్వర్ రెడ్డి చెమటలు పట్టిస్తున్నారు. వైసిపి ఎంఎల్ఏ ఏ స్ధాయిలో కేశవ్ ను కట్టడి చేశారంటే నియోజకవర్గం దాటి బయటకు వెళ్ళలేని స్దితిలో పడిపోయారు. రోజులో ఎక్కువ గంటలు నియోజకవర్గంలోని ఏదో ఓ గ్రామంలో తిరుగుతునే కనిపిస్తున్నారు. ఎందకిలా చేస్తున్నారంటే గుణపాఠం నేర్చుకున్నట్లు స్వయంగా కేశవే చెబుతున్నారు. పోయిన ఎన్నికల్లో చేసిన తప్పు జరగకూడదనే ఇపుడు జాగ్రత్త పడుతున్నట్లు కేశవ్ చెబుతున్నారు.
ఇంతకీ పోయిన ఎన్నికల్లో ఏం జరిగిందంటే టిడిపి తరపున పయ్యావుల, వైసిపి తరపున విశ్వేశ్వరరెడ్డి ప్రధానంగా పోటీ చేశారు. హోరా హోరీగా జరిగిన ఎన్నికలో విశ్వేశ్వర్ 3 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతుకుముందు జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా పయ్యావుల చాలా రోజులుగా నియోజకవర్గంలో కనబడటం మానేశారు. ఎక్కువ కాలం హైదరాబాద్ లోనే గడిపేశారు. దాంతో నియోజకర్గంతో సంబంధాలు తగ్గిపోయాయి. పోలింగ్ కు వారం రోజులుందనగా మాత్రమే పయ్యావుల నియోజకవర్గంలో తిరిగారు. అయితే, జనాలు అప్పటికే కేశవ్ కు వ్యతిరేకంగా తీర్పివ్వాలని నిర్ణయించుకున్నట్లే ఉన్నారు. అందుకే 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపి అభ్యర్ధి విశ్వేశ్వర్ కూడా చాలా గట్టి అభ్యర్ధే. పైగా వామపక్షాల నేపధ్యమున్న నేత కావటం బాగా కలిసివచ్చింది. సరే, వైసిపి ప్రతిపక్షానికే పరిమితమైనా విశ్వేశ్వర్ మాత్రం నియోజకవర్గాన్నే అంటిపెట్టుకున్నారు. ఎప్పుడు చూసినా జనాల్లోనే కనబడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై జనాలను సమీకరిస్తు ఆందోళనలు చేస్తునే కనిపిస్తున్నారు. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాల ద్వారానే కాకుండా సొంతంగా కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దానికితోడు ప్రభుత్వంపై పెరిగిపోయిన జనాల వ్యతరికేత వైసిపి ఎంఎల్ఏకి కలసివస్తోంది.
ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలవటమంటే పయ్యావులకు చిన్న విషయం కాదు. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో పట్టున్నా పార్టీతో పాటు ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత కేశవ్ కు ఇబ్బందులుగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఖాయమే అయినా ప్రత్యర్ధిని ఓడించటమెలా ? అన్నదే కేశవ్ కు పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రతీ రోజు నియోజకవర్గంలోని ఏదో ఒక గ్రామంలో తిరుగుతున్నారు. టిడిపి అని కాకుండా తనను వ్యక్తిగతంగా చూసి ఓట్లు వేయాలని మాట్లాడుకుంటున్నారని సమాచారం.
అధికారంలో ఉండి కూడా వచ్చే ఎన్నికల్లో గెలవటానికి పయ్యావుల ఇంతలా చెమటోడుస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు, కేశవ్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవటం పెద్ద అవరోధంగా మారుతోంది. హంద్రీ-నీవా ప్రాజెక్టు క్రింద నియోజకవర్గంలోని 82 వేల ఎకరాలు ఆయకట్టకు నీరందాలి. కానీ అందలేదు. అదే విధంగా ఎన్టీఆర్ గృహాల్లో అవినీతి తదితరాలను విశ్వేశ్వర్ జనాల్లో బాగా హైలైట్ చేస్తుండటం కూడా పయ్యావులకు ఇబ్బందిగా మారింది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పయ్యావుల, సీటును నిలుపుకునేందుకు విశ్వేశ్వర్ పెద్ద ఫైటే చేస్తున్నారు. మరి ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.