టీడీపీ నేతలు ఏం మాట్లాడిన మీడియా ఉంది కదా అని... ప్రజలు గమనిస్తున్నారన్న సంగతీ కూడా మర్చి పోయి ప్రతి పక్షం మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యేకహోదా దండగ.. అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారే. రైల్వే జోన్ సంగతి సరే సరి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కి సంబంధించి విభజన చట్టంలో స్పష్టత వున్నా, ఆ రైల్వేజోన్ని విజయవాడ - గుంటూరులకు తగరలించేందుకు అధికార పార్టీలో జరిగిన 'కమ్మ'నైన లాబీయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉక్కు పరిశ్రమ విషయంలో టీడీపీ నాటకాలేంటో, సీఎం రమేష్ నిరాహార దీక్ష 'డ్రామా' చెప్పకనే చెబుతుంది.
ఇక, తాజాగా మరోమారు రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ నేతలు హైడ్రామా క్రియేట్ చేశారు. విజయవాడలో రైల్వే జీఎంతో జరిగిన సమావేశంలో టీడీపీ ఎంపీలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 'రైల్వేజోన్ ఇవ్వాల్సిందే..' అంటూ గుస్సా అయ్యారు. సందట్లో సడేమియా, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి పారిపోయారంటూ ఎద్దేవా చేసేశారు. రైల్వే జోన్ కోసం వైసీపీ కేంద్రాన్ని నిలదీయడంలేదనీ, కేంద్రంతో వైసీపీ కుమ్మక్కయ్యిందనడానికి ఇదే నిదర్శనమనీ టీడీపీ ఎంపీలు మండిపడ్డారు.
నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగిన టీడీపీ.. ఆ పాపాన్ని కడుక్కునే క్రమంలో, బురద వైఎస్సార్సీపీ మీద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. 'తా చెడ్డ డాష్ డాష్.. అంతటినీ చెడగొట్టింది..' అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. ఉత్తరాంధ్ర నుంచే టీడీపీ ముఖ్య నేత అశోక్ గజపతిరాజు కేంద్రంలో నాలుగేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. మరో టీడీపీ ముఖ్య నేత సుజనా చౌదరి, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడాయె. ఈ ఇద్దరూ రైల్వే జోన్ కోసం ఏనాడైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా.?