ఆధార్ కార్డ్ నంబర్తో సమాజంలోని అట్టడుగు వర్గా ప్రజలకు గుర్తింపు లభించిందని దేశ సర్వోన్నత న్యాయస్థానం - సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ ఆధార్ కార్డు వలన సాధికారిత లభించినట్టైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి అన్నారు. ఆధార్ కార్డు రాజ్యాంగ బద్దమైనదని ఆయన స్పష్టం చేశారు.
ఆధార్ కార్డ్ తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై బుధవారం నాడు కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ ఏకే సిక్రి తీర్పును చదివి విన్పించారు.
కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. సుమారు బిలియన్ మందికి పైగా భారతీయులు ఆధార్ నమోదు చేసుకున్నారని న్యాయస్థానం ఈ సందర్భంగా తెలియజేసింది.
*బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని
*మొబైల్ కనెక్షన్లకు కూడా అవసరం లేదని చెప్పింది.
*పాఠశాల అడ్మిషన్లకు, సీబీఎస్ఈ, నీట్, యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది.
ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడానికి, పాన్ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలని కోర్టు వెల్లడించింది. కాగా ఆధార్ డేటా భద్రతపై అనుమానాలు అవసరంలేదనీ, ఇది పూర్తి సురక్షితమని, విశిష్టమైనదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం ఆధార్ కీలక పాత్ర పోషిస్తోందనీ, వారికి ఓ గుర్తింపు కల్పిస్తోందని తెలిపింది.
ఇతర కార్డుల మాదిరిగా దీన్ని డూప్లికేట్ చేయడం కుదరదని గుర్తు చేసింది. ఇటీవల సంవత్సరాల్లో ఆధార్ పై విస్తృత చర్చ జరిగిందని, ఆధార్కార్డు ఉన్నత మైనది అనే కంటే విశిష్టమైనది అనడం సమంజసంగా ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ వ్యాఖ్యానించారు.
డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పటిష్టమైన డేటా భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది.