వైసిపి తరపున గెలిచి తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించినందుకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావుకు రూ. 12 కోట్లు అందిందా ? ఎంఎల్ఏ హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రత్యక్ష సాక్ష్యుల ద్వారా అవుననే సమాధానం వినిపిస్తోంది. పోయిన ఆదివారం కిడారితో పాటు మాజీ ఎంఎల్ఏ సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గ్రామకార్యదర్శి కార్యక్రమంలో పాల్గొని వస్తున్న పై ఇద్దరిని మావోయిస్టులు మధ్యలో ఆపి పక్కకు తీసుకెళ్ళి కాల్చి చంపేశారు.
అయితే, వారిద్దరిని కాల్చి చంపేముందు వారితో దాదాపు గంటసేపు మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఎందుకంటే, పై ఇద్దరితో మాట్లాడినపుడు, కాల్చేసినపుడు పలువురు స్ధానిక గిరిజనులు కూడా అక్కడే ఉన్నారు. వారి సమక్షంలో మావోయిస్టులకు, గిరిజనలకు మధ్య జరిగిన సంభాషణలు బయటకు వచ్చాయి.
దాని ప్రకారం పార్టీ ఫిరాయించినందుకు ఎంత తీసుకున్నావని మావోయిస్టులు ప్రశ్నించగా రూ .12 కోట్లు ఇచ్చారని ఎంఎల్ఏ చెప్పారట. డబ్బుతో పాటు మైనింగ్ లైసెన్సులు కూడా ఇచ్చినట్లు అంగీకరించారట. లైసెన్సుల వ్యవహారం మొత్తం మంత్రి నారా లోకేషే చూసుకున్నట్లు స్పష్టంగా చెప్పారట. రెండు పెద్ద కార్లు కొన్నావని అడిగినపుడు ట్రైకార్ సంంస్ద నుండి సబ్సిడీపై తీసుకున్నట్లు అంగీకరించారట. తాను తప్పులు చేశానని తనను క్షమించి వదిలేస్తే రెండు రోజుల్లో అన్నింటినీ వదిలేసుకుని రాజకీయాల నుండి తప్పుకుంటానని కూడా ఎంఎల్ఏ బ్రతిమలాడుకున్నారట.
తర్వాత సోమ మాట్లాడినపుడు తనను ఎంఎల్ఏతో కలిసి పనిచేయాలని పార్టీనే ఆదేశించినట్లు మాజీ ఎంఎల్ఏ చెప్పారట. మైనింగ్ కు అవసరమైన పెట్టుబడి ఎంఎల్ఏ నే పెట్టుకుని వచ్చిన ఆదాయంలో తనకు 25 శాతం వాట ఇస్తున్నట్లు అంగీకరించారట. ఏ కార్యక్రమమైనా, ఫంక్షనైనా సరే ఎంఎల్ఏ, తాను కలిసే హాజరవ్వాలని పార్టీనే ఆదేశించిందని సోమ స్పష్టంగా చెప్పారట. ఈ వివరాల ప్రకారం అభివృద్ధిని చూసే తాము పార్టీ మారినట్లు ఫిరాయింపులు చెబుతున్నదంతా అబద్దాలే అని మరోసారి తేలిపోయింది.