ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకై కృషిచేసి మార్పును సాధించిన ఆరుగురు ప్రముఖులకు సంస్థలకు ఐఖ్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం ప్రకటించింది. అయితే అంతర్జాతీయ సౌరశక్తి అవగాహన వినియోగ ఒప్పందానికిగాను భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ జీన్ మైఖెల్ ఫెడ్రిక్ మాక్రన్ కు సంయుక్తం గా ఐక్య రాజ్య సమితి పురస్కారం ప్రకటించింది. యూఎన్ బహూకరించే "చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్" అవార్డును మోడీ - మాక్రన్లు కలసి గెలుచుకున్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రతిసంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తారు. ఇదే యుఎన్ పర్యావరణం విషయంలో అత్యంత ప్రతిష్టాత్మక గౌరవ పురస్కారం. ఈ పురస్కార గ్రహీతలు సమకాలీన సమాజములో పర్యావరణం కోసం దాని సమతౌల్యం కోసం "ధైర్య సాహసోపేత నిర్ణయాలు, తీసుకొని, అందుకోసం అలసటలేని పోరాటం సలిపిన వారై ఉంటారు. అలాంటి విశిష్ఠమైన వ్యక్తులను గుర్తించి ఎంపిక చేస్తారు.
2022 లోపు ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించాలన్న దృఢదీక్షను చేపట్టినందుకు గాను నరెంద్ర మోడీకి ఈ అవార్డు దక్కింది. ఫ్రాన్స్, భారత్ మధ్య సౌరశక్తి పై అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతలకు ఈ అవార్డును ప్రకటించారు. అలాగే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా యూఎన్ పర్యావరణ అవార్డు రావడం జరిగింది.
కాగా, తనకు యుఎన్ పర్యావరణ అవార్డు రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు భారత్ కు దక్కిన గౌరవమన్నారు. ఎన్నో తరాల నుంచి భారతీయులు ప్రకృతితో సహజీవం చేస్తున్నారని, ప్రకృతి గొప్పతనాన్ని మానవులు స్వీకరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సమస్యలు ఏవైనా, సమతౌల్య పర్యావరణ న్యాయం కోసం పోరాటం చేయాలని అన్నారు.