జనసేన అధినత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా ? స్వయంగా పవనే ఆ విషయాన్ని వెల్లడించటం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏలూరు బహిరంగ సభలో మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని చెప్పగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక పార్టీ అధినేతను అంతం చేయటానికి కుట్ర జరుగుతోందంటే మామూలు విషయం కాదు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డుకోవటంలో భాగంగా ఏకంగా తనను అడ్డుతొలగించుకోవటానికే ప్లాన్ వేస్తున్నట్లు పవన్ చెప్పటం విశేషం.
హత్యకు కుట్ర జరుగుతోందని చెప్పిన పవన్ అంతటితో ఆగకుండా తన హత్యకు ఎవరు కుట్రపన్నుతున్నారో కూడా తనకు తెలుసంటూ పెట్ట బాంబే పేల్చారు. తనను చంపితే ఏమవుతుంది మహా అయితే ఓ నెల రోజుల పాటు గొడవలవుతాయి తర్వాత అంతా సద్దుకుంటుందని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు పవన్ చెప్పారు. ఆ ముగ్గురు ఎవరో ఏ పార్టీ వారో కూడా తనకు బాగా తెలుసన్నారు.
అధికార పార్టీ క్రిమినల్ ఎంఎల్ఏలను ప్రోత్సహించటం ద్వారా రాష్ట్రాన్ని బీహర్, ఉత్తరప్రదేశ్ లా మార్చేస్తున్నట్లు మండిపడ్డారు. టిడిపిలో చింతమనేని ప్రభాకర్ లాంటి క్రిమినల్ ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో అర్ధం కావటం లేదన్నారు. జన, మాన ప్రాణాలకు భద్రత లేకున్నా, ఇబ్బంది కలుగుతన్నా ఎవరిపైనా చర్యలు తీసుకునే స్ధితిలో ప్రభుత్వం లేకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంతకీ వపన్ హత్యకు కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ? ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు సమాధానాలు కనిపించటం లేదు.