సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన తన సొంత నియోజకవర్గం కొడంగల్లోనే వున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలవనున్న రేవంత్రెడ్డి, తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రచారం షురూ చేసేశారు. సరిగ్గా ఈ టైమ్లోనే ఆయన ఇంట్లోనూ, ఆయన బంధువల ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ సోదాల గురించి తెలుసుకున్న వెంటనే, రేవంత్రెడ్డి.. తన అభిమానుల్ని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'నేను అరెస్ట్ అవుతానేమో..' అనే సంకేతాల్ని ఆయన స్పష్టంగానే ఇచ్చేశారు. అరెస్టయినా, జైలు నుంచే నామినేషన్ పత్రాలు పంపిస్తాననీ ప్రకటించేశారు రేవంత్రెడ్డి. కేసీఆర్కి భయపడేది లేదంటూ రేవంత్రెడ్డి తెగేసి చెప్పారు.
మూడేళ్ళ క్రితం నాటి ఓటుకు నోటు కేసు.. తదనంతర పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి, మరోమారు కార్నర్ అయ్యే అవకాశముందంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీని వీడినా, చంద్రబాబు కనుసన్నల్లో నడిచిన ఓటుకు నోటు వ్యవహారం నుంచి రేవంత్ రెడ్డి ఇప్పటికీ తప్పించుకోలేని పరిస్థితి. ఎందుకంటే, ఆ కేసులో మొదటి నిందితుడు ఆయనే మరి. రెడ్ హ్యాండెడ్గా తెలంగాణ ఏసీబీకి చిక్కేశారు రేవంత్రెడ్డి.
ఇదిలా వుంటే, రేవంత్రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి మద్దతు బాగానే లభించింది. పలువురు కాంగ్రెస్ నేతలు, ఆయనకు బాసటగా నిలిచారు. మరోపక్క, ఇలాగే ప్రచారంలో వుంటే 30 వేల ఓట్లతో గెలుస్తా, జైలుకు వెళితే 50 వేల ఓట్ల తేడాతో గెలుస్తానని రేవంత్ రెడ్డి, కోస్గి రోడ్ షోలో వ్యాఖ్యానించడం మరో విశేషం. బహుశా ఇదే తన చివరి ప్రసంగం కావొచ్చనీ, కొడంగల్ ప్రజల్ని నమ్మి వెళుతున్నానంటూ.. రోడ్ షో ముగించి.. హైద్రాబాద్ బయల్దేరారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో బిజీ గా ఉన్న సమయం లో కేసీఆర్ ప్రభుత్వం అదును చూసి దెబ్బ కొట్టింది. దీనిని తెరాస పార్టీ ఖండించిన ఆ దాడుల వెనుక ఖచ్చితంగా తెరాస ప్రభుత్వం ఉంది.