మరో నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేడు మరో కీలక కేసులో తీర్పును వెలువరించనున్నారు. కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల నడుమ వయసున్న మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ దాఖలైన పలు పిటీషన్లపై విచారణను పూర్తి చేసిన ధర్మాసనం నేడు తీర్పును వెలువరించనుంది. ఇప్పటి వరకు  రుతుస్రావం కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది.


లింగసమానత్వానికి అది విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.  అయ్యప్ప స్వామి 'బ్రహ్మచారి' అని అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో తెలిపారు. ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా నిషేధం విధించడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందని వ్యాఖ్యానించింది.


చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో పాటు న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం ఖాన్ విల్కర్, ఇందూ మల్హోత్రా, చంద్రచూడ్ ల బృందం ఈ కేసును విచారించింది. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు మహిళల ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా, కేరళ ప్రభుత్వం తొలుత వ్యతిరేకించి, ఆపై మహిళల ప్రవేశానికి సమ్మితిని తెలిపిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే.. గత మూడు రోజులుగా సుప్రీంకోర్టు పలు కీలక అంశాలపై తీర్పులను వెలువరిస్తోంది.


ప్రతి విషయానికీ ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని, వివాహేతర సంబంధాలు నేరం కాదని, అయోధ్య అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తీర్పులు వెలువరించింది.  ఈ నేపథ్యంలో  పురుషుడు ఆలయంలోకి వెళ్లగలిగినప్పుడు, మహిళ కూడా వెళ్లగలుగుతుంది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25, 26ల ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయి'' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: