ఇపుడిదే ప్రశ్న తెలుగురాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. గడచిన రెండు రోజులుగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటి, ఈడి శాఖల ఉన్నతాధికారులు దాడులు చేసి విస్తృతంగా సోదాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అక్రమార్జన, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టటం, ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమీషన్ ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో పూర్తి ఆస్తుల వివరాలు చెప్పకపోవటం, ఆదాయపు పన్ను ఎగ్గొట్టటం, మనీ ల్యాండరింగ్ లాంటి అనేక కేసులు నమోదు చేశారు. నిజంగానే ఆ కేసులపై విచారణ జరిగి రేవంత్ దోషనో లేకపోతే నిర్దోషనో తేలాలంటే ఈ జీవితం సరిపోదన్న విషయం అందరికీ తెలిసిందే.
రేవంత్ వ్యవహారాలపై ఇపుడు పెట్టిన కేసులన్నీ ఇప్పటికిప్పుడు బయటపడినవి కావు. ఎప్పటి నుండో రేవంత్ పై ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికల సమయంలో అందులోనూ కెసిఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు ఏకమైన తర్వాత ఒక్కసారిగా దర్యాప్తు సంస్ధలు మీదపడటం ఆశ్చర్యంగా ఉంది. అంటే తెరవెనుక ఎవరో దర్యాప్తు సంస్ధలను నడిపిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయంటే తప్పేమీలేదు.
నిజానికి రేవంత్ ఒక్కడేనా అక్రమార్జన చేస్తున్నది ? రేవంత్ ఒక్కడేనా నిబంధనలను ఉల్లంఘించింది ? చట్టంలోని లొసుగులను అడ్వాంటేజ్ తీసుకున్నది ఒక్క రేవంతేనా అన్న ప్రశ్న ఇపుడు అందరినోటా వినబడుతున్నది. దర్యాప్తు సంస్ధలు గనుక గట్టిగా అనుకుంటే నూటికి 99 శాతం మంది నేతలు జైళ్ళల్లోనే ఉంటారనటంలో సందేహం లేదు. ఇపుడు రేవంత్ ఎదుర్కొంటున్న అడ్డుగోలు సంపాదన లాంటి ఆరోపణలు ఏపిలో టిడిపి నేతలపై లెక్కేలేదు. ఏపిలో అక్రమార్జన ఆరోపణలకు అతీతమని చెప్పుకునేందుకు ఒక్కరైనా ఉన్నారా అన్నదే సందేహం. స్వయంగా చంద్రబాబు, చినబాబులపై వినిపిస్తున్న ఆరోపణల సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. కాకపోతే దర్యాప్తు, విచారణ అన్నది నిష్పక్షపాతంగా జరిగితే చాలు.