తెలంగాణ రాజకీయాలు మరింత రాజుకున్నాయి. అసలే ఉప్పు నిప్పు మాదిరిగా ఉన్న టీఆర్ ఎస్, కాంగ్రెస్ వర్గాలు తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరింతగా ఉడికిపోతున్నాయి. ఈ నెల 6న తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ.. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతా అనుకున్న విధంగానే చాపచుట్టేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఈ ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించడం, తిరిగి అధికార పగ్గాలు చేపట్టడం వంటి కీలకమైన అంశాలను లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ ఆదిశగానే అడుగులు వేయడం ప్రారంభించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక వహించిన కాంగ్రెస్ను గట్టి దెబ్బకొట్టాలని కేసీఆర్ వ్యూహం.
నిజానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరిగితే.. అప్పటికి తన ప్రబుత్వంపై వ్యతిరేకత.. కాంగ్రెస్కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీనిని గమనించిన కేసీఆర్ ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికల్లోకి దూకారు. ఇక, గడిచిన వారం రోజులుగా ఉన్న పరిస్థితిని గమనిస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఊపు పెరుగుతున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. దీనిని గుర్తించిన కేసీఆర్.. అనూహ్యంగా కక్ష రాజకీయాల వైపు రాష్ట్ర రాజకీయాలను దారి మళ్లించారు.
ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ నేతలపై దాడులు చేయిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్న.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని పాస్ పోర్టు కేసులో అరెస్టు చేసిన పోలీసులు జైల్లో ఉంచడం, ఆయన బెయిల్పై రావడం తెలిసిందే. అయితే,ఈ కేసు దాదాపు 8 సవంత్సరాల కిందటి కేసు. ఇక తాజాగా కాంగ్రెస్కు కంచు కంఠంగా మారిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం మరింత దుమ్ము రేపుతోంది. రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. దీంతో ఆయనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్ ఇలా దాడులు చేయిస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.
తెలంగాణ కాంగ్రెస్ కార్య నిర్వాహక అధ్యక్షుడుగా ఉన్న రేవంత్రెడ్డిపై ఐటీ దాడులు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అంటున్నారు.ఇటీవల జగ్గారెడ్డి, ఇప్పుడు రేవంత్రెడ్డి, ఇంకా ఎందరిపై కక్ష సాధిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దాదాపు 20 ఏళ్ల నుంచి రేవంత్రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడని, ఇప్పుడే ఐటీ దాడులు ఎందుకు చేశారో ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు దుయ్యబడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం చాలా సీరియస్ కానుందని అంటున్నారు పరిశీలకులు. మరి కేసీఆర్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.