చంద్రబాబు తాజాగా చేసిన ఓ ప్రకటనపై ప్రజాస్వామ్యవాదులు, హక్కుల నేతలు సైతం మండి పడుతున్నారు. పాలన చేతకాక, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేక చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికిప్రధాన కారణం.. ఆయన మావోయిస్టులకు లొంగిపోయినట్టుగా ప్రకటనలు చేయడమే! విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వబోమని, ఈ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం బాక్సైట్ జోలికి వెళ్లదని పదే పదే చెప్పినా.. ఇటువంటి చర్యల(లివిటిపుట్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య)కు పాల్పడడం సరికాదని మావోయిస్టులనుద్దేశించి అన్నారు. కిడారి, సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పాడేరు, అరకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బాక్సైట్ తవ్వకాలపై రెండు దఫాలుగా ఒప్పందాలు కుదుర్చుకు న్నారు. వాటికి ఇక్కడి గిరిజనుల అంగీకారం లేదు. అందుకే మేం అధికారంలోకి వచ్చాక ఒప్పందాలు రద్దు చేశాం. దీనిపై ఆయా కంపెనీలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై కేంద్రం వివరణ అడుగుతోంది.- అంటూ బాబు వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పాలనానుభవం అంటూ పెద్ద గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు మావోయిస్టులకు, వారి రక్త పిపాసకు లొంగిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విస్తృత ప్రజాప్రయోజనమే పాలనకు గీటురాయిగా వ్యవహరిం చాల్సిన రాష్ట్రాధినేత చేసిన వ్యాఖ్యలు `బాక్సౌట్ తవ్వం.. తవ్వం.. తవ్వం..`` అంటే . ఆయన మావోలకు లొంగిపోయినట్టు అనిపించడం లేదా? ప్రజాస్వామ్య వ్యవస్థలో పది మంది కోసం ఒక్కరికి, వంద మంది కోసం పది మందికి బాధకలిగినా తప్పులేదు.
విశాఖ మన్యమే కాదు.. రాష్ట్ర భూగోళంలో ఉన్న ఖనిజ వనరును వెలికి తీసి .. తద్వారా జాతుల పునరుద్ధరణకు పాటు పడడం అనేది అనాది గా ఉన్నదే. ఇప్పుడు చంద్రబాబుతో ఈ ఖనిజ నిక్షేపాల వెలికితీత ఆగిపోదు. ఆయనతోనే ఇది అంతమై పోదు ప్రజాప్రయోజనం ఉన్న ప్రతి విషయంలోనూ కొందరికి బాధ కలిగినా.. ఎక్కువమందికి లబ్ధి కలిగిన ప్పుడు దానిని కొనసాగించడంలో తప్పులేదు. కానీ, మన్యంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబు మావో యిస్టులకు పూర్తిగా సరెండర్ అయినట్టు కనిపిస్తోంది. తన పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల కోసం మొత్తం జాతి ప్రయోజనాలనే పణంగా పెట్టేందుకు మావోయిస్టులను చూసీ ఏపీ సీఎం భయపడుతున్నాడనే వ్యాఖ్యలను భరించేందుకు కూడా సీఎం సిద్ధపడడం సిగ్గుచేటనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఒక్క ప్రజలనే కాకుండా అహరహం వారికిరక్షణ కల్పిస్తున్న పోలీసుల మనోస్థైర్యాన్ని సైతం దెబ్బతీసేదిగానే ఉండడం గమనార్హం. ఇకపై ఎక్కడ ఏది కావాలనుకుంటే అక్కడ మావోయిస్టులను రంగంలోకి దింపితే చాలనే పరిస్తితి ఏర్పడనుందనేదానికి బాబు వ్యాఖ్యలు సంకేతంగా మారాయి. మావోయిస్టులు కోరుతున్నది బాక్సైట్ తవ్వకాల నిషేధ రూపంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణ. ప్రజాప్రతినిధుల దోపిడీకి అడ్డుకట్ట. ఈ రెండు కుదరనంతకాలం.. ప్రబుత్వాలు ఇలా సాగిలపడాల్సిందే!