రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. తరచుగా ఈ మాట మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు తమ తమ వ్యూహాలకు పదును పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు శత విధాల ప్రయత్నాలు ముమ్మరం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఈ కోవలోనే రాజధాని జిల్లాలైన గుంటూ రు, కృష్ణాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లోనూ సత్తా చాటాలని నిర్నయించుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును సైతం ముమ్మరం చేశారు. రాజధాని జిల్లాలుగా ఉన్న గుంటూరు, కృష్ణాల్లో టీడీపీకి బలం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రధాన నియోజకవర్గాల్లో టీడీపీ గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కింది. దీనిని గమనించిన జగన్ వచ్చే ఎన్నికల్లో వీరికి చెక్ పెట్టేదిశగా పావులు కదుపుతున్నారు.
ఈ రెండు జిల్లాల్లోనూ మంత్రులుగా ఉన్న నలుగురికి చెక్ పెట్టేదిశగా జగన్ వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. అదే సమయంలో టీడీపీ కి ఫైర్ బ్రాండ్గా ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమాకు కూడా చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇక్కడ బలమైన నాయకుడిగా, బ్రాహ్మణ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ను జగన్ రంగంలోకి దింపేందుకు ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్టు సమాచారం. ఇక, మంత్రలు దేవినేని ఉమాపై వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ పోటీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మచిలీపట్నంలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇక జిల్లాకే చెందిన మరో మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని రంగంలోకి దిగుతున్నారు. నాని ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా దూసుకుపోతున్నారు. ఇక, గుంటూరులో ఇప్పటికే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు జగన్ చుక్కలు చూపిస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి విడదల రజనీకి ఆయన ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. దీంతో ఆమె నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ దూసుకుపోతోంది. ప్రతి ఒక్కరినీ పలకరిస్తోంది. ఇక, వేమూరు నియోజకవర్గంలోనూ జగన్ మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మేరుగ నాగార్జునను మరోసారి రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు సమాచారం. అటు వరుసగా రెండుసార్లు ఓడిన మేరుగకు సానుభూతి పవనాలు పని చేస్తున్నాయి. దీంతో మంత్రి నక్కా ఆనందబాబుకు చుక్కలు కనిపించడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.