పాదయాత్ర లో ఉన్న జగన్ ను కొంత మంది ఉపాధ్యాయులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అయితే తాజాగా పాదయాత్రలో జగన్ ను కలిశారని తొమ్మిది మంది టీచర్లపై సస్పెన్షన్ వేటువేశారు. ఇదీ చంద్రబాబు ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఉలికిపడుతున్న తీరు. సదరు టీచర్లు.. ఏమైనా రాజకీయ మద్దతు ప్రకటిస్తూ జగన్ ను కలిశారా? అంటే అదీ లేదు. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు టీచర్లు.
ఈ విషయంలో వారు జగన్ ను కలిసి తమ సమస్యను ఏకరువు పెట్టుకున్నారు. తమకు అధికారం వస్తే ఈ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చాడు. ఇదివరకూ కూడా బోలెడంత మంది ఉపాధ్యాయులు ఈ విషయంలో జగన్ ను కలిశారు. అయితే తాజాగా తొమ్మిది మందిపై వేటేశారు. అందుకు కారణం వీరు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి చెందినవారు కావడమే.
గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో టీచర్లు జగన్ ను కలిశారు. దీంతో వారిపై అధికారాలు కలిగిన గంటాకు కోపం వచ్చింది. అధికారులకు చెప్పి వేటు వేయించినట్టుగా తెలుస్తోంది. చేతనైతే సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే ఊరికే ఉండాలి. అంతేకానీ.. తమ సమస్యలను ప్రతిపక్ష నేతకు చెప్పుకున్నారని.. ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేయడం అంటే.. చంద్రబాబు ప్రభుత్వానికి చాలా పెరిగిపోయిందని స్పష్టం అవుతోంది. అయినా విరగాలంటే ఈ మాత్రం పెరగాలిలే!