ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏపి
స్పీకర్ కోడెల శివప్రసాద్ కు షాకిచ్చింది. కోడెలపై విచారణలో ఉన్న కేసుకు సంబంధించి
ఈనెల 10వ తేదీన వ్యక్తిగతంగా కోర్టులో హాజరవ్వాలంటూ ఈరోజు ఆదేశించింది. ఇంతకీ
విషయం ఏమిటంటే, ఆమధ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో కోడెల మాట్లాడుతూ పోయిన ఎన్నికల్లో
తాను రూ 11.50 కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా చెప్పారు. ఎన్నకల నిబంధనల ప్రకారం
ఒక ఎంఎల్ఏ అభ్యర్ధి రూ 25 లక్షలకు మించి వ్యయం చేయకూడదు. కానీ కోడెలకు అయిన ఖర్చు
అక్షరాల 11.50 కోట్ల రూపాయలు.
కోడెల మాటల ఆధారంగా అప్పట్లో కోడెలతో పోటీ చేసి ఓడిపోయిన వైసిపి అభ్యర్ధి అంబటి రాంబాబు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. సరే, ఆ ఫిర్యాదు ఏమైందని అడక్కూడదు. అయితే అదే విషయమై కరీనంగర్ వ్యక్తి శ్రీనివాసులరెడ్డి జిల్లా కోర్టులో మరో కేసు వేశారు. ఆ కేసులో కోర్టు కోడెలకు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే, ఆ కేసు విచారణ ఎంతదాకా వచ్చిందో కూడా తెలీదు.
ఇంతలో ఎంఎల్ఏలు, ఎంపిలపై ఉన్న కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రింకోర్టు అన్నీ రాష్ట్రాలను ఆదేశించంది. అప్పటి వరకూ వివిధ కోర్టుల్లో ఉన్న కేసలను ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కూడా చెప్పింది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు కోడెల కేసు బదిలీ అయ్యింది. ఆ కేసులోనే ఈరోజు విచారణ జరిగింది. కేసు విచారణలో భాగంగా ఈనెల 10వ తేదీన కోడెల వ్యక్తిగతంగా హాజరవ్వాలంటూ ఆదేశాలు రావటంతో టిడిపిలో టెన్షన్ మొదలైంది.