సభాపతిగా మనదేశంలో ప్రజాస్వామ్యానికి వస్త్రాపహరణం శాసనసభలో జరిగినా ఏమాత్రం ప్రశ్నించని ఈ సభాపతి - రాజీనామాలు చేసిన ప్రతిపక్ష శాసనసభ్యుల పత్రాల పై కొన్నేళ్ళుగా చర్యలు తీసుకోకుండా తొక్కిపట్టిన నీతివంతమైన పాలనకు నాలుగేళ్ళుగా మద్దతుగా నిలిచారు. అంతటి మహనీయునికి నేడు హైకోర్టులో చుక్కెదురైంది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు విచారణ కోసం ఈనెల 10న హైకోర్టు ధర్మాసనం ముందు హాజరు కావాలంటూ సభాపతి కోడెల శివప్రసాదరావు కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు గతంలో ఒక టివి ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ 2014 ఎన్నికల్లో తాను ₹ 11.50 కోట్ల ఖర్చుపెట్టానని చెప్పారంటూ సింగిరెడ్డి భాస్కర్రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ కోర్టులో పిటిషన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ, అందుకు తగిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించిన పిటిషనర్ ఐటీ అధికారులతో ఈ విషయమై విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికల నిబంధన 171 ఈ, ఎఫ్, జీ, ఐ ఆఫ్ 200 ఐపీసీ కింద కోడెల శివప్రసాదరావును విచారించి. అంత పెద్ద మొత్తంలో ఖర్చు ఎందుకు పెట్టారు? ఆ సొమ్ము ఎక్కడినుండి వచ్చింది? ఎవరి ద్వారా ఖర్చు పెట్టారో? విచారణ జరపాలని కోర్టును కోరారు పిటిషనర్.
దీంతో ఈ కేసులో స్పీకర్ కోడెల అప్పట్లో తాను కూడా హైకోర్టును ఆశ్రయించి స్టే పొందగా, అది గత నెల 27తో ముగిసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 న జరిగే విచారణకు స్పీకర్ కోడెల స్వయంగా హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఒక టివి ఛానెల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నికల్లో పెరుగుతున్న వ్యయం గురించి స్పీకర్ కోడెల వివరిస్తూ తాను రాజకీయ ప్రవేశం చేసిన మొదట్లో, అంటే 1983 లో జరిగిన ఎన్నికల్లో ₹30వేలు ఖర్చుచేశానని, ఆ ₹30వేలు కూడా గ్రామాల్లోని ప్రజలనుంచి చందాల రూపం లో వచ్చాయని చెప్పారు. అప్పటినుంచి ప్రతీ ఎన్నికలకూ ఖర్చు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో తనకు ₹11.50 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని మీడియా సముఖంగా బహిర్గతం చేశారు కోడెల శివప్రసాదరావు. దీంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో పాటు అప్పుడు ఆయన చేసిన ఆ వ్యాఖ్యలే తరువాత తల నొప్పిగా పరిణమించాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ సింగిరెడ్డి భాస్కరరెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్పీకర్ కోడెలను అనర్హుడిగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో కోడెల హైకోర్టు నుంచి స్టే పొందడం, తాజాగా హై కోర్టు ఆదేశం పరిణామాలు చోటుచేసుకున్నాయి.