నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరుతో జరిగిన సీ - ఓటరు ప్రీ పోల్ సర్వే వివరాలను రాత్రి రిపబ్లికన్ టివి ప్రసారం చేసింది. ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ప్రజల్లో వివిధ రాజకీయ పార్టీల స్థానం ఏమిటనే విషయాన్ని సీ - ఓటరు ప్రీ పోల్ సర్వే తేల్చింది. వైసిపి వైఎస్ జగన్మోహన రెడ్డి హవా కొనసాగుతుందని, టిడిపి, ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధారుణ పరాభవం తప్పదని ఆ సర్వే తేల్చిపారేసింది.
వైఎస్ జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని వైసిపి ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్ సంస్థ జరిపిన ప్రీ పోల్ సర్వే లో నిర్ద్వంధంగా తేల్చింది.
ఆంధ్రప్రదేశ్ లో
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీ అతిఘోరంగా దెబ్బ తినబోతుందని సెప్టెంబర్ నెల లో జరిపిన ఈ సర్వే వివరాలను తేల్చింది. వైసిపి, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీ చేస్తేనే ఆంధ్ర ప్రదేశ్ లోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైసిపి 21 సీట్లు, టీడీపీకి 4 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.
బీజేపీ, కాంగ్రెస్ లకు కనీసం ఒక్క సీటు కూడా రాదని తేల్చింది. ఓట్ల శాతం చూస్తే, వైసిపీ కి 41.9 శాతం ఓట్లు, టీడీపీ కి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014 తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికి పైగా ఓట్లు తగ్గిపోనున్నాయని ఈ సర్వే వివరించింది.
తెలంగాణలో
2014లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఏపీలో టీడీపీకి 15సీట్లు, బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏపీలో 8స్థానాల్లో గెలుపొందింది.
తెలంగాణలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వే చెబుతోంది. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 9, కాంగ్రెస్ కు 6, బీజేపీ, ఎంఐఎం లకు చెరో సీటు దక్కవచ్చని ఈ సర్వే తేల్చింది. 2014లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలుపొందింది.
ఇప్పుడు ఆ పార్టీకి దాదాపు 35 శాతం ఓట్లు పడతాయనీ, 2014 తో పోలిస్తే 2 సీట్లు తగ్గుతాయని సర్వే అంటోంది. తెలంగాణ లో కాంగ్రెస్–టీడీపీ, ఇతర పార్టీలు కలిసి ఎన్నికల్లో కూటమిగా పోటీచేయాలని ఇప్పటికే నిర్ణయించడం తెలిసిందే. 2014 లో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేయగా ఇరు పార్టీలూ చెరో సీటును గెలిచాయి. ఇటీవలే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది.
ఇప్పుడు బీజేపీ తన ఒక్క సీటును నిలుపుకోనుండగా టీడీపీ మాత్రం ఆ సీటును కూడా కోల్పోనుందని తేలింది. మరోవైపు కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచినప్పటికీ టీడీపీ, ఇతర పార్టీల కూటమితో లాభపడి ఈసారి ఆరు సీట్లు గెలవనుందని సర్వే పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 2014 లో వచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు 22 శాతం ఓట్లు అధికం గా వస్తాయనీ, అయితే ఆ పార్టీ ఒక్క సీటుకే పరిమితమవుతుందంది.
భారత్ దేశం లో
2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే అధికారంలోకి రానుందని తేలింది. అయితే 2014 లాగా ఈసారి కమలం పార్టీకి సొంతగా మెజారిటీ రాదని స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై రిపబ్లిక్ టీవీ, సీ–వోటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 276 చోట్ల గెలుపొందనుందని వెల్లడైంది. అటు కాంగ్రెస్ కాస్త పుంజుకున్నప్పటికీ యూపీఏ 112 స్థానాలకే పరిమితం కానుందని సర్వే పేర్కొంది.