అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అరకు ఉప ఎన్నికలు లేవని తేల్చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కూడా గడువు లేనందువల్ల ఎన్నికలు పెట్టలేమని ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. దాంతో అరకు ఉప ఎన్నికపై ఇంతవరకూ సాగిన ఊహాగానాలకు తెర పడినట్లైంది. అలాగే ప్రత్యేక హోదాపై రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల విషయంలోనూ ఏడాది లోపు గడువు ఉన్నందువల్ల నిర్వహించడం లేదని తేల్చేసింది.
అలా అయితే టెన్షనే :
ఉప ఎన్నికలు వస్తే అరకులో మావోయిస్టుల చెతిలో హత్య చేయబడిన కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్ ని నిలబెట్టాలని బాబు భావించారు. అదే సమయంలో వైసీపీ ఏం చేస్తుందన్న చర్చ కూడా మొదలైంది. నంధ్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తన క్యాండిడేట్ ని నిలబెట్టింది. ఇపుడు కూడా అదే రూల్ ఫాలో అయితే ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా జరిగితీరేవి. అపుడు బోల్డెంత టెన్షన్ అధికార పార్టీలో ఉండేది. ఇపుడు ఆ బెంగ కాస్తా ఈసీ క్లారిటేతో తీరిపోయింది.
బాబు ఏం చేస్తారు :
మావోల ఘాతుకానికి బలైన కిడారి కుటుంబాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇపుడు ఆయన చేయగలిగింది వచ్చే ఎన్నికల్లో శ్రావణ్ కి టికెట్ ఇవ్వడం. అంటే మరో ఆరు నెలల్లొ జరిగే సార్వత్రిక ఎన్నికలపుడన్న మాట. మరి అంత వరకూ అంటే సుదీర్ఘ నిరీక్షణే. పైగా సెంటిమెంట్, సానుభూతి కోసం బాబు తహతహలాడుతున్నారాయే. ఈలోగా ఏమైనా చేయగలుగుతారా అంటే ఆయన చేత అర్జెంట్ గా మంత్రి పదవికి ప్రమాణం చేయించడం.
బహుశా బాబు ఇపుడు హామీ నిలబెట్టుకోవాలంటే అదే చేస్తారని అంతా భావిస్తున్నారు. ఏది ఏమైనా అరకు ఉప ఎన్నికలు జరిగితే ప్రజాభిప్రాయం ఏంటో వెల్లడయ్యేది. మరి ఏసీ బ్రేక్ వేయడంతో అసలైన ఎన్నికల వరకూ టీడీపీ, వైసీపీ సిసలైన జనాభిప్రాయం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.