గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు.  మొన్నటి వరకు చెడ్డీ గ్యాంగ్ చేసిన బీభత్సం అందరికీ తెలిసిందే.  అయితే చెడ్డీ గ్యాంగ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంత మంది దొంగలు చేస్తున్న బీభత్సానికి మాత్రం అడ్డు కట్ట వేయలేక పోతున్నారు.  డబ్బు కోసం దేనికైనా తెగిస్తున్న ఈ నరరూప రాక్షసులు చివరికి దేవుడి గుడిని కూడా వదలడం లేదు.  తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కొత్తగూడెం పట్టణంలోని సాయిబాబా గుడిలో దోపిడీకి పాల్పడ్డారు.  తమ దోపిడికి అడ్డు వచ్చిన వాచ్ మెన్  చల్లా వెంకటరెడ్డిని  అతి దారుణంగా చంపి ఆలయంలోని హుండీలను ఎత్తుకెళ్లారు… గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి అందరు పడుకున్న సమయంలో వచ్చి ఇంత ఘాతుకం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.   

కొత్తగూడెం పట్టణంలోని ప్యూన్ బస్తీకి చెందిన చల్లా వెంకటరెడ్డి(70) ఫైర్ స్టేషన్ ఎదురుగా గల సాయిబాబా గుడిలో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.  సాయిబాబా ఆలయంలోని రెండు హుండీల్లో సుమారు 5లక్షల రూపాయలకు పైగానే నగదు ఉంటుందని భావిస్తున్నారు.  నిన్న కొందరు దుండగులు రాత్రిపూట గోడను దూకి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో గుడిలో నిద్రిస్తున్న వెంకటరెడ్డి వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన దొంగలు ఓ రాడ్డుతో అతని తలపై మోదారు. అనంతరం విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంకటరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక గుడిలోని హుండీలను పగులగొట్టి నగదును దోచుకుపోయారు.

ఈ రోజు ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి దీన్ని గమనించి విషయాన్నిపోలీసులుకు తెలిపారు.  మాచారం అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, డీఎస్పీ అలీ తమ సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు. గుడిలోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపును ప్రారంభించామనీ, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ సునీత్ దత్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: