ప్రజా సంకల్ప పాదయాత్ర తో దూసుకెళ్ళిపోతున్న వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన మహాసభలో ఏపీ సీఎం చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పై అదిరిపోయే డైలాగు లు వేశారు.
గతంలో ఐటీ దాడులు రాష్ట్రంలో జరిగినప్పుడు ప్రశ్నించిన చంద్రబాబు ఎన్నికల ముందు ఐటీ దాడులు జరుగుతుంటే ఎందుకు అంత బెదిరి పోతున్నారని ప్రశ్నించారు జగన్. అవినీతి సొమ్మును కేంద్రం బయటికి తీసుకుంటే..రాష్ట్రాన్ని కేంద్రం ఇబ్బందులు పెడుతుంది అని చెప్పటం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని అన్నారు. తప్పు చేయని వారు ఎందుకు భయపడుతున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు జగన్.
చీపురుపల్లి నియోజకవర్గంలో తానే తోటపల్లి కట్టినట్లు చంద్రబాబు ఫోజులు కొడుతున్నారని, కొత్త ప్రాజెక్టులకు కాదు... ఉన్న ప్రాజెక్టులనే పక్కన పెట్టేశారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని, ప్రతీ పైసా బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ఇసుక, మద్యం, భూములు అన్నీ మాఫియానేనని అన్నారు.
విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరింత అవినీతి చేసి కష్టాలు పాలు చేశారని పేర్కొన్నారు జగన్. ఇటువంటి దారుణమైన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన విధంగా తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలనుద్దేశించి జగన్ విజ్ఞప్తి చేశారు.