జగన్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎమ్మెల్యే నేతలను మార్చుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే వంగవీటి రాధకు సీటు మార్పిడి చేసాడు. అయితే ఇప్పుడు కూడా పార్టీ స్థాపించిన దగ్గర్నుంచి జగన్ కు తోడులా, ఆయన నీడలా వెన్నంటి ఉంటున్న నాయకులను పట్టించుకోవాల్సింది పోయి, వాళ్లకే టికెట్లు ఇవ్వకుండా జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి.
ఇప్పటికే చాలామంది అనుయాయులను గాలికొదిలేసిన జగన్, తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని కూడా అసమ్మతి పేరు చెప్పి పక్కనపెట్టాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి, జగన్ కు ఆర్కే మొదటి నుంచి వీరవిధేయుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఓదార్పు యాత్రల సమయంలో జగన్ కు అండగా నిలిచి భారీగా ఖర్చు చేస్తూ, రాష్ట్రమంతటా జగన్ కు నీడలా ఆయన వెంటే పయనించిన ఆర్కేను జగన్ పక్కనపెట్టాలని భావించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ పలువురు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్కే రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉండటంతో ఒక రకంగా తెలుగుదేశంకు, సీఎం చంద్రబాబుకు తరచూ కంట్లో నలుసుగా మారి కోర్టు కేసుల ఆర్కేగా పేరుగడించారు. అయితే మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్కు చెప్పగా ఆయన మౌనం వహించడమే తప్ప తిరిగి పోటీ చేయాలని ఒత్తిడి చేయలేదని తెలుస్తోంది. ఆ తర్వాత అప్పో సొప్పో చేసి ఆర్థిక వనరులను సమకూర్చుకున్న ఆర్కే… కొద్ది రోజుల క్రితం తిరిగి తాను పోటీకి సిద్ధమని చెప్పగా, నీపై నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తానంటూ షరతులు పెట్టిన జగన్ పరోక్షంగా టిక్కెట్ లేదని చెప్పకనే చెప్పాడంటూ పలువురు నేతలు మండిపడుతున్నారు..