నేడు తెలంగాణాలో తెలుగు దేశం పార్టీని గతం వెంటాడుతుంది. అసలు టిడిపి జననమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేఖత, డిల్లీ ఆధిపత్యాన్ని నిరసిస్తూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రోత్సహిస్తూ అనేక నూతన సిద్ధాంతాలను ప్రభోదిస్తూ ఉవ్వెత్తున కెరటమై లేచిన జన జయకేతనం టిడిపి. దాని వ్యవస్థాపక అధ్యక్షుడు ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు వెంట తెలుగుజాతి ఒకటై సాగిన ప్రవాహం నేడు నిస్తేజమై అదే కాంగ్రెస్ పాదాల చెంత నీ కాల్మొక్కుత బాంచన్ దొరా! అనే తీరులో సాగిలపడి తెలుగు ప్రజల పరువు తీస్తుంది. ఆత్మాభిమానాన్ని మురికి గుంటలో కలిపేస్తుంది.
తెలంగాణ ముందస్తు ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ - టీడీపీ మరికొన్ని చిన్నా చితక ముతక పార్టీలతో కలసి "మహాకూటమి" ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటి పురపాలక శాఖామంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదిక గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో (2014 నాటి) కాంగ్రెస్పై చంద్రబాబు చేసిన ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేస్తూ మహాకూటమి పొత్తుపై నిలదీశారు కేటీఆర్.
అప్పుడు ఇటాలియన్ మాఫీయారాజ్, కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనకు ప్రజలు ముగింపు పలుకునున్నారని, ఈ విషయం తన ప్రజాగర్జన ద్వారా తెలిసిం దని, ఇటాలియన్ మాఫియా రాజ్ కథ ముగిసిందని చంద్రబాబు అప్పట్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ను షేర్ చేసిన కేటీఆర్.. ‘ఆ ఇటాలియన్ మాఫియా రాజ్ అతను ఇప్పుడు ప్రాణ మిత్రులు (జిగ్రీ దోస్తులు) అయ్యారు. అతనెవరో చెప్పుకోండి? ఇప్పుడు తెలిసిందా? నేను ‘మహాఘటియాబంధన్' అని ఎందుకు పిలుస్తానో?' అని పేర్కొన్నారు.
అధికార దాహం తోనే కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు రాత పూర్వకంగా అంగీకరించినందుకే వరుసగా 2004, 2009లలో కాంగ్రెస్, టీడీపీలతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని అన్నారు. అవినీతి కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి కలిగించడమే తమ లక్ష్యమని 2014లో పేర్కొన్న చంద్రబాబు, నేడు అదే కాంగ్రెస్ తో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ను ఇటాలియన్ మాఫియారాజ్ గా అభివర్ణించి ఇప్పుడే అదే కాంగ్రెస్తో ఎలా జతకట్టారని కేటీఆర్ మంగళవారం ట్విట్టర్లో ప్రశ్నించారు.
బాబుగారి మరో ఆణిముత్యం - ‘రాహుల్ గాంధి, సోనియా గాంధిలకు కొత్తగా ఇప్పుడు తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చింది. గతంలో కూడా తెలంగాణలో వారు పర్యటించారు. అప్పుడు తెలంగాణ అభివృద్దికి ఏం చేశారు?' అని ప్రశ్నిస్తూ చంద్రబాబు గతంలో ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ను షేర్ చేసిన కేటీఆర్ - ‘బాబుగారి మరో జ్ఞాన ఆణిముత్యం.. స్కామ్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు 2014 వరకు తెలంగాణ అభివృద్దికి చొరవ చూపలేదన కుంటే, అప్పటి నుంచి ఇప్పటికి ఏం మారింది?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
అంతేగాక, ఇంకా పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావ్? అని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు అప్పుడేమన్నారంటే.. అవినీతిమయమైన కాంగ్రెస్ నుంచి దేశాన్ని రక్షించడమే తమ ముందున్న లక్ష్యమని, ఇందుకు కావాల్సిన పని చేస్తామని, నిస్వార్థ పొత్తులకు ప్రాధాన్యత నిచ్చే తమను చరిత్ర గుర్తిస్తుందని చంద్రబాబు నాయుడు గతంలో ట్వీట్ చేసిన మరో ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. బాబు నాటి వ్యాఖ్యలపై కేటీఆర్! ఎమోజీలను పెట్టి చివరి వ్యాఖ్యలను గమనించాలంటూ వ్యంగ్యంగా స్పందించారు.
ఇప్పుడు కాంగ్రెస్-టీడీపీ పొత్తునేమంటారు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమని కాంగ్రెస్- టీడీపీలు అంగీకరించిన తర్వాతే 2004, 2009లో కాంగ్రెస్-టీడీపీలతో పొత్తు పెట్టుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ-కాంగ్రెస్ల అక్రమ పొత్తుకు కారణమేమిటి?" అని ప్రశ్నించారు. ఇదో అవకాశవాద, అధికార దాహంతో కూడిన రాజకీయమని విమర్శించారు.