వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డంతో విప‌క్షం వైసీపీ అధినేత వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి రావ‌డం, రాజ‌న్న రాజ్యాన్ని నెల‌కొల్ప‌డమే ధ్యేయంగా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీకి చుక్క‌లు చూపించి, శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించ‌డమే ల‌క్ష్యంగా వేస్తున్న ఎత్తుల‌కు టీడీపీ నాయకులు చిత్తుకావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ వేసిన వ్యూహాలు అధికార పార్టీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నా యి. ముఖ్యంగా త‌మ‌కు తిరుగులేద‌ని భావించిన టీడీపీ నాయ‌కులు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆప‌రేషన్ ఎన్నారైని జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. దీంతో ఆయా నేతల‌కు ఎన్నిక‌ల‌కు ముందే సినిమా క‌నిపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరులో.. టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా తిరుగు లేదు. కానీ, ఇక్క‌డ జ‌గ‌న్ వేసిన పాచిక పార‌డంతో ఇప్పుడు చింత‌మ‌నేని చింత‌ల్లో కూరుకుపోయారు. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున కొఠారు రామ‌చంద్ర‌రావు కుమారుడు కొఠారు అబ్బ‌య్య చౌద‌రిని జ‌గ‌న్ నిల‌బెట్టారు. ఆయ‌న ఎన్నారై. దీంతో ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతోపాటు విద్యావంతుడు కావ‌డంతో అధికారుల‌తో మాట్లాడి ఇక్క‌డి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలోనూ ఆయ‌న ముందున్నారు. దీంతో చింత‌మ‌నేనికి సెగ‌తగులుతోంది. దీంతో నిన్న మొన్న‌టి వ‌రకు కూడా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోని చింత‌మ‌నేని ఇప్పుడు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. 


ఇక‌, గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో త‌న‌కు తిర‌గులేద‌ని భావించిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు.. జ‌గ‌న్ వ్యూహంతో నీరుగారి పోతున్నారు. ఇక్క‌డ ఎన్నారై మ‌హిళ, బీసీ వ‌ర్గానికి చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీని జ‌గ‌న్ ఇక్క‌డ నిల‌బెట్టారు. దీంతో ఆమె పుల్లారావుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతున్నారు. ఏ స‌మ‌స్య న్నా అక్క‌డ వాలిపోయి.. వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో ఇక్క‌డ త‌న‌కు తిరుగులేద‌ని, త‌న‌మాట‌కు ఎదురు లేద‌ని భావించిన పుల్లారావు.. ఇప్పుడు చెమ‌ట‌లు క‌క్కుతున్నారు. 


అదేవిధంగా ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరులో మ‌రో ఎన్నారై వైవి.రెడ్డి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈయ‌న‌ను జ‌గ‌న్ గిద్ద‌లూరులో పోటీకి నిల‌బెడుతార‌ని వినిపిస్తోంది. దీంతో ఎటు చూసినా.. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు కూడా ఎన్నారైలు వైసీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగుతార‌ని స‌మాచారం. ఏదేమైనా వైసీపీలో జ‌గ‌న్ ఎన్నారై వ్యూహం స‌క్సెస్ అవుతుండడం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: