విజయసాయి రెడ్డి. వైఎస్ ఫ్యామిలీకి ఆత్మీయ బంధువు. జగన్ సంస్థల ఆడిటర్. వ్యాపార భాగస్వామి. అయితే, ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీగా కూడా ఉన్నారు. ఇన్ని బాధ్యతలు నెరవేరుస్తున్న విజయసాయి పార్టీకి ప్లస్గా ఉన్నాడా ? లేక మైనస్ అవుతున్నాడా? అనేది చర్చకు దారితీస్తోంది. రాజకీయాల్లో ఉన్నవారు అందునా ప్రదాన ప్రతిపక్షం వైసీపీ లో కీలక బాధ్యతలు చూస్తున్నారు. మరి ఆ స్థాయికి తగిన విధంగా వ్యవహరిస్తున్నారా? ఆ స్థాయికి తగిన విధంగా పార్టీని ముందుకు తీసుకు వెళ్తున్నారా? అనే అంశాలు కీలకంగా మారాయి. అయితే, ఆయా విషయాల్లో విజయసాయి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు.. ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నాయే తప్ప.. ఆశించిన మైలేజీని మాత్రం ఇవ్వడం లేదని పార్టీ నాయకులే అంతర్గత సమావేశాల్లో చెప్పుకొంటున్నారు.
అధికార పార్టీని ముఖ్యంగా సీఎం చంద్రబాబు, లోకేష్లను ఆయన టార్గెట్ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టే అవకాశం లే దు. అయితే, పసలేని విమర్శలు చేయడమే ఆయనను తీవ్రంగా నవ్వుల పాలు చేస్తోంది. నిర్మాణాత్మక విమర్శలు చేయా ల్సిన ఉన్నత విద్యావంతుడు.. రోడ్డు సైడ్ రోమియోలాగా వ్యవహరిస్తూ.. బఫూన్ మాదిరిగా ఏమాత్రం పసలేని విమర్శలు చేస్తుండడం పార్టీని భ్రష్టు పట్టిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్తానం వివాదం వచ్చినప్పుడు ఆలయంలో కనిపించని కృష్ణదేవరాయులు ఇచ్చిన నగలు.. చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని విమర్శించారు. అది కూడా 12 గంటల్లోనే సోదాలు చేయాలని, లేకపోతే.. సింగపూర్ వంటి విదేశాలకు తరలించే ప్రమాదం ఉందని అన్నారు. ఇక, వేల కోట్లు దోచేశారంటూ.. లోకేష్పై విమర్శలు చేశారు.
వీటికి ఆధారాలు చూపించాలని అధికార పక్షం డిమాండ్ చేసినప్పుడు మౌనం వహించారు. మేం అధికారంలోకి వస్తే.. అధికారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు విజయసాయి వంటి ఉన్నత విద్యా వేత్త చేయడం చాలా చీప్గా అనిపించింది. అప్పట్లోనే ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేసి మరింత పలుచనయ్యారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్రం బోనెక్కించాలి.. రూ.5 లక్షల కోట్ల ప్రజాధనం దోచి విదేశాల్లో దాచారు..’ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని.. విజయ్మాల్యా, నీరవ్ మోదీలా విదేశాలకు పారిపోయే ఆలోచనలో సీఎం ఉన్నారని తెలిపారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పాస్పోర్టులను వెంటనే సీజ్ చేసి బోనులో నిలబెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరి ఇలాంటి విమర్శలను తెలుగు ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారో .. ఆయనే ఆలోచించుకోవాలి. ఏదైనా విమర్శ చేస్తే.. గోడకు సున్నవేసినట్టు ఉండాలే తప్ప.. పసలేని విమర్శలు చేస్తే.. ఆయనకన్నా ఎక్కువగా పార్టీ నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది. నిజానిజాలు ప్రజలకు చెప్పగల దమ్ముంటే.. ఆ ఐదు లక్షల కోట్ల తాలూకు వివరాలను కూడా ఆయన ప్రజలకు సమర్పిస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చే దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే చంద్రబాబుపైనా ఆయన కుమారుడు, మంత్రి లోకేష్పైనా చర్యలు తీసుకునేలా సిఫార్సు చేసే అవకాశం ప్రతిపక్ష పార్టీకి ఉంటుందన్న విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఇప్పటికైనా మారితే మంచిది .. అని విశ్లేషకులు సూచిస్తున్నారు.