ఒక్క చాన్స్ యిస్తే అభివృద్ధి రుచేమిటో తెలంగాణాకు చూపుతాం: అమిత్ షా
ఒక్కో విషయంపై సమగ్రంగా వివరించిన అమిత్ షా ప్రసంగం పూర్తి పాఠం:
కరీంనగర్ లో బుధవారం (అక్టోబర్ 10)
సాయంత్రం నిర్వహించిన బీజేపీ సమరభేరి సభలో కమలదళాధిపతి
అమిత్ షా ప్రసంగించారు. బీజేపీ సమరభేరికి హాజరైన అమిత్ షా - టీఆర్ఎస్,
మహాకూటమి, ఎంఐఎం లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. షెడ్యూల్ ప్రకారం
2019 లో ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీ ప్రభావం తనపై పడుతుందని కేసీఆర్ భయపడ్డారని,
అందుకే 9 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు.
#దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైపోయిందని షా నిలదీశారు. దళితుడిని సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్కు లేదన్నారు. కొడుకునో, కూతురునో సీఎం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని షా ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.
#దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని అమిత్ షా చెప్పారు.
#లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు.
#ఇప్పటికీ తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నాలుగున్నరేళ్లలో ఒక్క లెక్చరర్ పోస్టును భర్తీ చేయలేదని ఆరోపించారు.
#పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఇప్పటివరకు 5 వేల ఇళ్లను కూడా నిర్మించలేదన్నారు.
#తెలంగాణ అమరుల కుటుంబాలను కేసీఆర్ మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు.
#కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయారని చెప్పారు.
#తెలంగాణకు కేంద్రం రూ.99వేల కోట్లు కేటాయించినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని షా ఆరోపించారు.
#తెలంగాణలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల ఆత్మహత్యల పాపం టీఆర్ఎస్ దేనని అమిత్ షా విమర్శించారు.
#రైతులకు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేసిన టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని, తెలంగాణలో బీజేపీకి అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతామని అమిత్షా చెప్పారు.
#రజాకార్లు చేసిన అరాచకాలను తెలంగాణ ప్రజలు మరువగలరా? అని అమిత్ షా ప్రశ్నించారు. రజాకార్ల దురాగతాలను తెలంగాణ సమాజం మరచిపోగలదా? అని బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఒవైసీకి భయపడే కేసీఆర్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పక్కనబెడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ విమోచనం పొందిన రోజు సెప్టెంబర్ 17ను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సమరయోధుల త్యాగాలను అవమానపరుస్తుందన్నారు. తామ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
#ఎంఐఎం భయంతో విమోచన దినాన్ని కేసీఆర్ జరపడం లేదన్నారు. ఒవైసీల బారి నుంచి తెలంగాణకు ముక్తి కల్పించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అసదుద్దీన్ ఓవైసీని లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
#బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతామని చెప్పారు. ఓవైసీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, టీడీపీకి లేదని అమిత్ అన్నారు. ఎంఐఎంను ఎదిరించే సత్తా ఉన్న పార్టీ ఒక్క బీజేపీనే అని పేర్కొన్నారు. బీజేపీకి పట్టంకట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒవైసీ బారి నుంచి విముక్తి కల్పించాలని అన్నారు.
#ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు నష్టమని అమిత్షా చెప్పారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసమేనా? అని సభికులను అమిత్ షా ప్రశ్నించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు చెప్పిందని, మరి కేసీఆర్ ఎవరి రిజర్వేషన్లకు కోత పెట్టి మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తారని నిలదీశారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.
#తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు.
#బంగ్లా చొరబాటు దారులను దేశం నుంచి తరిమికొడతామని అమిత్ షా చెప్పారు. అక్రమ వలసదారులు దేశంలోనే ఉండిపోవాలా? అని అమిత్ షా ప్రశ్నించారు. వారిని దేశం నుంచి కచ్చితంగా తిప్పి పంపిస్తామని చెప్పారు. ‘బంగ్లాదేశీ చొరబాటుదారులు ఈ దేశంలో ఉండాలా? చొరబాటుదారులను బయటకు పంపించేందుకు బీజేపీ ప్రభుత్వం ఎన్ఆర్సీ తీసుకొచ్చింది. కానీ, కాంగ్రెస్ తదితర పార్టీలు విదేశీ చొరబాటుదారులు ఇక్కడే ఉండాలంటున్నారు. బీజేపీ ప్రభుత్వం వారిని పంపించి తీరుతుంది’ అని అమిత్ షా అన్నారు.
#దేశంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందో వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. బైనాక్యులర్ పెట్టి చూసినా దేశంలో ఎక్కడా కాంగ్రెస్ కనిపించదని అమిత్ షా ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఎప్పటికీ కాలేదని చెప్పారు. టీడీపీతో కలిసినా టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలేదని, ఆ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీయే అని ఆయన స్పష్టం చేశారు.
#తెలంగాణలో మహాకూటమి
గెలిస్తే ఎంఐంఎంకు వ్యతిరేకంగా పోరాడగలదా? అని షా ప్రశ్నించారు. ఎంఐఎంను ఎదుర్కొనే
దమ్ము బీజేపీకే ఉందన్నారు. ‘రాహుల్ బాబా నాయకత్వంలో
2014తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. ఇవాళ దేశంలో
కాంగ్రెస్ను భూతద్దం పట్టుకొని వెతకాల్సిన పరిస్థితి. ఇలాంటి కాంగ్రెస్ తెలంగాణలో
టీఆర్ఎస్కు ఎన్నడూ ప్రత్యామ్నాయం కాలేదు’ అని అమిత్ షా అన్నారు.
వాజ్పేయికి అపూర్వమైన రీతిలో బీజేపీ నివాళులర్పించిందని, అటల్ అంతిమ యాత్రలో ప్రధాని మోదీ ఏకంగా ఐదు కిలోమీటర్లు నడిచారని అమిత్ షా గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డ, కరీంనగర్ గడ్డపై పుట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీలో జరపకుండా నాడు కాంగ్రెస్, సోనియా గాంధీ అడ్డుకున్నారని అమిత్ షా విమర్శించారు. పీవీ అంత్యక్రియలు జరిపించకుండా అవమానించిన కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీ కాంగ్రెస్ అని షా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తో, రాహుల్ & కంపెనీతో సాధ్యం కాదన్నారు. దేశాన్ని పునర్నిర్మించడం కోసం నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని అమిత్ షా చెప్పారు.