దేశంలో రాజకీయం ఎంతగా కుళ్ళిపోయిందో తెలియాలంటే తెలంగాణా కాంగ్రెస్ లో ఈ మద్య జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటే చాలు మొత్తం కలుషితమైన రాజకీయాల సమగ్ర స్వరూపం అర్ధమౌతుంది. స్త్రీలు జాతికిని ముందుకు నడిపించే మాధ్యమాలు అన్న నానుడిపై వేటేస్తూ జాతి పరువు తీసిన ఒక నారీమణి వీర గాధ వినవలసిందే. తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ గంగానదలా కలుషితమౌతూనే ఉంది. మరీ ఈ మద్య వికృత వింత పోకడలతో వైతరుణీ నదిలా మారిపోతుంది.
ఉదాహరణకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెడిఎస్ అనే ఒక అతి మైనారిటీ పార్టీకి "ముఖ్యమంత్రి సింహాసనం" ఇచ్చి దాని పాదాల చెంత ఇంత చోటు కోసం పడిగాపులు పడటం చూస్తూనే ఉన్నాం. ఇదెలా ఉందంటే ఒక వికృత పోకడలతో ఒక బలమైన శత్రువును ఎదుర్కోవటానికి ఒక మరుగుజ్జును వేడు కున్నట్లుంది. శత్రువెంత ఎంత బలవంతుడైతే మనం అంత బలపడి పోతాం అనేది వదిలేసి సమయానికి సర్దుకోవటంతో సరిపెట్టుకొని మొత్తం నైతికంగా పరువు పోగొట్టుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంతగానైనా దిగజారి పోతుందనేది అందరికి అర్ధమై పోయింది. అదే ఇప్పుడు తెలంగాణాలో మరో రూపంలో రిపీట్ అయింది. అదేంటంటే:
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు ఝలక్ ఇస్తూ బీజేపీలో చేరిపోయిన ఆయన ధర్మపత్ని పద్మినీ రెడ్డి సాయంత్రానికి మరో షాక్ ఇచ్చారు పరువు మొత్తం పోగొట్టుకునే మలుపు తీసుకుంటూ. గత గురువారం ఉదయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కమలం పార్టీలో కాషాయం చీర కట్టుతో చేరిన ఆమె కేవలం కొన్ని గంటల వ్యవధి లో కమలం చీరెను వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ హస్తం చిటికిన వేలు పట్టుకుంటూ సిగ్గులేకుండా బిజెపిని వీడుతున్నట్లు మొత్తం తెలంగాణా జనాలకు షాకిస్తూ సంచలన ప్రకటన చేశారు.
దీంతో బీజేపీ శ్రేణులు షాక్ అవగా కాంగ్రెస్ నేతలు మాత్రం పొద్దున వదిలేసి తిరిగి స్వగృహానికి వచ్చేసిన అమ్మణ్ణి చూసుకొని "హమ్మయ్యా!" అని ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ కాంగ్రెస్ తీరు. ఇంతకంటే సిగ్గుమాలిన పనేమైనా ఉందా! కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోవేదన చూడలేక బీజేపీ నుంచి గంటల వ్యవధిలోనే తప్పుకుంటున్నట్లు మీడియా సమావేశంలో ఆ మహిళామణి పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నట్లు పద్మినీ రెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీ లో చేరడం తో కాంగ్రెస్ పార్టీ నుంచి అంతలా అటాక్ (బహుశ ఆమె భర్తకు కావచ్చు) వస్తుందని తాను ఊహించలేక పోయానని, అందుకే మనసు మార్చుకున్నట్లు చెప్పారు. అనుకోకుండా తాను తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేతలను, కార్యకర్త లను అంతలా బాధిస్తుందని అనుకోలేదని కూడా. పోతేపోయిందని కాంగ్రెస్ ఊరకుండి ఉంటే గౌరవ ప్రధంగా ఉండేది.
అలా కాకుండా ఆమె బిజెపిలోనే ఉండి ఉంటే, సిద్ధాంతాలు సొల్లు అంటూ, భర్తను ఎదిరించిన వీరనారిలా గౌరవం అయినా దక్కి ఉండేది. ఇప్పుడామె రెండికి చెడ్ద రేవడే అయింది కదా!
గంటల్లోనే వెనక్కి — నీతికి నిజాయతీకి గౌరవానికి జాతికి పద్మినీ రెడ్డి షాక్
అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న దామోదర రాజనరసింహ సతీమణి పద్మినీ రెడ్డికే పార్టీ మేనిఫెస్టో నచ్చలేదంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేశారు. కీలక నేత ఇంట్లోనే పార్టీ విధివిధానాలపై అంత అనాసక్తి ఉంటే.. సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంతో అర్థమవుతుందంటూ గులాబీ నేతలు గురువారం రోజు ప్రచారం చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థిగా సంగారెడ్డి లేక మెదక్ నుంచి పోటీ చేస్తారని తెరపైకి రావడం గమనార్హం. బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరగగా.. అంతలోనే మరో ట్విస్ట్ ఇస్తూ ఆమె సొంతగూటి (కాంగ్రెస్)కి చేరుకున్నారు.
పద్మినీ రెడ్డి & ఉదయం జరిపిన కథ:
ఈ నెల 11న తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా "కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్" దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి బీజేపీ లో చేరారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్ లు గురువారం ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ కాషాయ కండువా తో ఆమెను పార్టీలోకి కమలం ఇచ్చి ఆహ్వానించారు.
అనంతరం మురళీధరరావు మీడియాతో మాట్లాడుతూ "పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవు తుంది. దేవాలయాల పునరుద్దరణలో ఆమె కృషి అభినందనీయం. రాబోయే రోజులో వారి సేవలు వినియోగించుకుంటాం. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై పద్మినీ బీజేపీ పార్టీలో చేరారు" అని తెలిపారు.
బీజేపీలోకి పద్మినీరెడ్డిని ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. భార్యా భర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా తప్పేం కాదని, ఆ స్వేచ్చవారికి ఉందని తెలిపారు. ఆ సందర్భంగా తాము అధికారంలోకి వస్తే తెలంగాణాలో మహిళా ఋణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ కూడా ఉంటుందని వెల్లడించారు.
అదలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకుడిగా ఉన్న "దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి" బీజేపీలో చేరడం రాజకీయవర్గాల్లో పెద్ద కుదుపుకుదిపింది. చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండటం ఏమిటని? చర్చించుకుంటున్నారు. తన ధర్మపత్ని తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీలో చేరడంతో మున్ముందు దామోదర రాజనరసింహకు కు ఇబ్బందికర పరిస్థితులు తప్పక పోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీల విమర్శలను ఆయన ఏవిధంగా ఎదుర్కుంటారో చూడాలి. అయితే బీజేపీలో చేరేందుకు పద్మినీ రెడ్డి తన భర్తను అనుమతి తీసుకున్నారా? లేదా? అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది. అయితే కొందరైతే ఇద్దరు భార్యాభర్తలు వెర్వేరు పార్టీల్లో ఉంటే పోయే దేమీ లేదని కాంగ్రెస్ కు అసలు సిగ్గేలేదని, అలా కాకపోతే తమ పార్టీ మహానేత ఇందిరాగాంధినే ధిక్కరిస్తూ జన్మించిన తెలుగుదేశం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ తో పోరాడిన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోగాలేంది ఆఫ్ట్రాల్ భార్య వేరే పార్టీతో జత కట్టితే బాధ పడనవసరం లేదు కదా!