ఏవోబీలో కూబింగ్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. గాలికొండ ఈస్ట్ డివిజన్ ఏరియా కమిటీ కార్యదర్శి గోపీ పేరుతో ఈ లేఖ విడులైంది. చంద్రబాబు ఒక తేనె పూసిన కత్తి అంటూ ఆయన మోసపూరిత ప్రకటనలతో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, టీడీపీ నేతలకు తరిమి కొట్టాలని రాశారు. క్వారీల ముసుగులో టీడీపీ నేతలు, వారి బంధువులు మన్యాన్ని ధ్వంసం చేస్తున్నారన్నారు. మన్యంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ను తరలిస్తున్నారని, గిరిజన సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. క్వారీ లీజులను ఆపాలని, గనులను తవ్వుకుపోతున్న నేతలను తరిమికొట్టాలని లేఖలో రాశారు.
ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజా ధనాన్ని, భూములను కొల్లగొట్టి అక్రమాస్తులను కూడగట్టుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా గిరిజన ప్రాంతాల్లో పారామిలటరీ, అర్ధసైనిక పోలీసు బలగాలను దింపి ప్రజలను అణిచివేస్తున్నారని, పోలీసులు రాష్ట్ర రాబంధు ల్లా మారిపోయారని ఆరోపించారు.
ఏపి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రాన్ని నిట్టనిలువున దోచుకుని అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటున్నట్టుగా రాష్ట్రం వెలిగిపోవడం లేదని, బుధవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో, క్వారీల ముసుగు లో మన్యాన్ని ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకులను మన్యం నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు.
మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద, సత్యనారాయణ, కిడారి సర్వేశ్వరరావు, వారి బంధువులు టీడీపీ నాయకులైన కె.ఎస్.ఎన్ రాజు, బుక్కా రాజేంద్ర, కమిడి రాంబాబులు ఏజెన్సీలో లెటరైట్, నాపరాయి, రంగురాళ్ళ క్వారీలతో ఆదివాసీలకు చెందిన పంట భూములను విధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారని ఆయన ఆరోపించారు. ఈ క్వారీలకు వ్యతిరేకంగా ఏజెన్సీలోని గూడెం ప్రాంత ప్రజలు దాదాపు 50 రోజులు పాటు ఆందోళన చేస్తున్నా టీడీపీ నేతలు వారి సేవకులైన పోలీసు అధికారులను రెచ్చగొట్టి గిరిజనులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబునాయుడు 2019లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పాకులాడుతున్నారని, అటు రాష్ట్రంలో ఇటు మన్యంలో ప్రజల జీవన పరిస్థితులు పూర్తిగా దిగజారి పోతున్నాయని, రాష్ట్రం ఋణాల ఊబిలో కూరుకుపోతుందని ఆరోపించారు. విశాఖ డివిజన్ లో అత్యధికంగా అనధికారిక క్వారీలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ భూమిలో నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా క్వారీ పనులు చేస్తున్నారన్నారు. టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు పీలా గోవింద, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, కిడారి సర్వేశ్వరరావు, అతని బంధువు బుక్కా రాజేంద్ర, కిమిడి రాంబాబు ఇష్టారాజ్యంగా క్వారీల్లో బ్లాస్టింగ్లు చేస్తున్నారన్నారు. దీని వల్ల వందల ఎకరాల్లో భూములు సాగుకు దూరమయ్యాయన్నారు.
గూడెం మండలం గుమ్మిరేవుల సమీపంలో నల్ల మెటల్ క్వారీలో పేలుళ్లకు వాడే మూడు రకాల రసాయనాల కారణంగా అక్కడ చెరువు కలుషితమై 2,050 ఎకరాలకు సాగు నీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. క్వారీల మూలంగా అనకాపల్లి డివిజన్లో పది మంది, మన్యంలో ఆరుగురు మరణించారన్నారు. జిల్లాలో ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 290మలేరియా, 1100టైఫాయిడ్, 21,800డయేరియా, 1,660డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. మన్యంలో వైద్యులు అందుబాటులో లేక గిరిజనుల పరిస్థితి గాలిలో దీపంలా మారిందన్నారు. కడుపు నింపే పౌష్టికాహారం లేక పిల్లలేకాదు ప్రజలంతా పిట్టాల్లా రాలిపోతున్నారన్నారు. అధికారాన్ని, పదవులను, ధనబలాన్ని అడ్డం పెట్టుని చట్టాన్ని చుట్టంగా చేసుకొని, అటవీ హక్కుల చట్టాలను కాలరాస్తూ కిరాతకాలు యదేచ్చగా చేస్తున్నారు.
ఆదివాసీ ద్రోహులైన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి, మణి కుమారి, ఎం.వి.వి. ప్రసాద్, నాగరాజు, అయ్యన్నపాత్రుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను బాక్సైట్, ఈవో 97, ఏపీఎప్డీసీ కాఫీ తోటల పంపకం లాంటి అంశాలపై నిలదీయాలని గిరిజనులను కోరారు. బీజేపీ, టీడీపీ నాయకుల ఇళ్లను ముట్టడించాలని, మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యేలు ఈశ్వరి, పీలా గోవింద తోపాటు రాంబాబు, రాజేంద్ర, నాగరాజు, ప్రసాద్, మణికుమారిలను తరమి కొట్టాలని దున్నేవాడిదే భూమి, ఆదివాసీలకే అటవీ హక్కు, గ్రామరాజ్య కమిటీలకే సర్వాధికారం అనే నినాదాలతో మావోయిస్టు ల ఆధ్వర్యంలో భూస్వామ్య, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారి వర్గంపై మూడు రకాల పోరాటం ఉధృతం చేయాలన్నారు.