ఏపీ హోం శాఖ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014లో విజయం సాధించిన నిమ్మకాయల చినరాజప్ప రాజకీయ ఫ్యూచర్ ఏంటి? ఆయన ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏం చేస్తారు? ఇప్పటికే స్థానికేతరుడు.. అనే పేరు పొందిన ఆయనకు స్థానికంగాకూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీటికెట్ వేరేవారికి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. మరి ఈ టికెట్ వేరేవారికి ఇస్తే.. రాజప్ప పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయాలి? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. నిజానికి పెద్దాపురం టికెట్ను స్తానిక టీడీపీ నాయకులు ఆశిస్తున్నారు. రాజప్ప స్థానికేతరుడని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, ఆయన ఇక్కడ చేసింది కూడా ఏమీ లేదని అంటున్నారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ రాజప్ప నిలబడ్డా కూడా ఓటమి ఖాయమని అంటున్నారు. ఇదిలావుంటే, టీడీపీ అధిష్టానం కూడా రాజప్పను మార్చాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లోఆయనకు ఎంపీ సీటును ఇవ్వాలని నిర్ణయించుకు న్నట్టు సమాచారం. ఇదిలావుంటే, చెలమల శెట్టి సునీల్ టీడీపీలో చేరతాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఈయ న పార్టీలోకి వస్తే.. కాకినాడ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఈయన వైసీపీలోకి వెళ్తానని కొందరితోను, జనసేన లోకి వెళ్తానని కొందరితోను చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో సందేహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ చెలమల శెట్టి సునీల్ టీడీపీలోకి చేరకపోతే.. ఆయన ప్లేస్లో రాజప్పకు కాకినాట ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా జిల్లాలో పార్టీ కేడర్ని కలుపుకునిపోవడంలో చంద్రబాబు మన్ననలు పొందారు. రాజప్ప అయితే కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలుపొందడం సునాయాసం అవుతున్నది పార్టీ అధిష్ఠానం యోచనగా కనిపిస్తోంది. స్థానికేతరుడైన రాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి 2014లో పోటీచేసి హోంమంత్రి అయ్యారు. ఈ దఫా పెద్దాపురం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండు వస్తోంది. రాజప్ప కూడా దీనిని సమర్థిస్తున్నారు. ’నేను ఎంపీగా వెళ్తే... పార్టీ మారకుండా ముందు నుంచీ నమ్మకంగా ఉన్నవారికే టిక్కెట్టు ఇప్పిస్తాను’ అని ఇప్పటికే రాజప్ప కొందరికి భరోసా కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇక్కడ ఎలాంటి మార్పు ఉంటుందో.. రాజప్ప ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి.