దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు ఎంతో సంబరంగా చేసుకుంటే..అక్కడ దసరా ఉత్సవాల్లో మాత్రం నెత్తుటి ఏర్లుగా పారింది..మృత దేహాలు చెల్లాచెదురై ఛిద్రంగా మారింది. పంజాబ్ లోని అమృత్ సర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. జోడా ఫాటక్ దగ్గర రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు ఏడు వందల మంది రైల్వే ట్రాక్ పై గుమ్మిగూడారు. ఎంతో సంతోషంగా దశమి వేడుకల్లో నిమగ్నమయ్యారు..ఆటలు పాటలతో సందడి నెలకొంది.
చౌరాబజార్ లో రావణ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో స్థానికంగా రైల్వే ట్రాక్ పక్కక గుంపులుగా చేరిన ప్రజల్లో కొందరు రైలు పట్టాలపైకి చేరారు. అదే సమయంలో రైలు రావడంతో దాదాపు 70 మంది చనిపోగా…అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది.రావణ దహనం జరుగుతుండటం, క్రాకర్స్ పేలుస్తుండటంతో వాటి సౌండ్కు రైలు హారన్ జనాలకు వినిపించలేదు.ట్రైన్ కింద పడిన వారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయింది. రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది.
ఎటు చూసినా మాంసపు ముద్దలే దర్శనమిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ 500 నుంచి 700 దాకా జనాలు ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే గేట్ వేసినా కూడా ప్రజలు గేటు దూకి మరీ వచ్చి వీక్షించారని తెలుస్తోంది. రావణ దహనం కార్యక్రమం ప్రతీ ఏటా అదే ప్రాంతంలో నిర్వహిస్తారని స్థానికులు చెప్తున్నారు. అయితే ఎప్పుడు ఇలాంటి ఘోరం జరగలేదని చెప్తున్నారు. పోలీసులు ప్రజలను రైలు ట్రాక్ దగ్గరకు వెళ్లకుండా నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను మోడీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, అధికార యంత్రాగం, దసరా కమిటీల నిర్వాకమే ప్రమాదానికి కారమమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. రైలు వెళ్తున్నప్పుడు కనీసం అప్రమత్తం చేసి ఉంటే.. ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు. ముందే అప్రమత్తం చేసి ఉంటే రైలు వేగం తగ్గి నిదానంగా వచ్చేదని వారన్నారు.