బీజేపీ సీనియర్ నేత, బెగుసరయ్ ఎంపీ బోలా సింగ్ (80)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శనివారం ఉదయం ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో బోలాసింగ్ భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన అంజలి ఘటించారు. బోలాసింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు.
గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ..రాం మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతు నిన్న రాత్రి కన్నుమూశారు. బిహార్లోని గ్రామీణ ప్రాంతంలో 1939లో జన్మించిన బోలా.. పట్నా యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. వామపక్ష భావాజాలం గల ఆయన 1967లో సీపీఐ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రం బెగుసరయ్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
1977లో కాంగ్రెస్లో చేరిన బోలా కొంతకాలం తరువాత పార్టీతో విభేదించి.. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ 1990లో అధికారంలోకి రావడంతో లాలూతో చేతులు కలిపారు. ఆ తరువాత 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెగుసరయ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన అసెంబ్లీ స్వీకర్గా వ్యవహరించారు. ఎనిమిది సార్లు శాసన సభ్యుడిగా, రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా సేవలందించారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతుర్లు.