ముందస్తు ఎన్నికల ముచ్చటకు తెరదీసిన తెలంగాణాలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి పలు చోట్ల చుక్కలు కనిపిస్తున్నా యి. రంగారెడ్డి, నిజామాబాద్ వంటి కీలక జిల్లాల్లోనే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికలపై టీఆర్ ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గట్టి ఆశలే పెట్టుకున్నారు. అయితే, చాలా మటుకు జిల్లాల్లో ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తుండడం ప్రమాదాన్ని సూచిస్తోందని అంటున్నారు. ఉదాహరణకు ఏపీ సరిహద్దు జిల్లా ఖమ్మంలోని కీలక నియోజకవర్గం సత్తుపల్లిలో పరిస్థితి అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. వాస్తవానికి ఖమ్మంలో టీఆర్ ఎస్కు బలం నామమాత్రంగానే ఉండడం గమనార్హం.
ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది. అదేసమయంలో వైసీపీ కూడా చాలా స్థానాల్లో బలాన్ని పుంజుకుంది. అయితే, కేసీఆర్ వేసిన వ్యూహంతో ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ టీఆర్ ఎస్ నిలదొక్కుకుంటుందని కేసీఆర్ భావించారు. ఆయన అనుకున్న విధంగానే ఇక్కడ ఈ ఇద్దరు టీడీపీ, వైసీపీలను కొంత మేరకు ప్రభావితం చేసి.. టీఆర్ ఎస్ పుంజుకునేలా చేశారు., కట్ చేస్తే.. ఇప్పుడు తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగింది. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పిడమర్తి రవిని రంగంలోకి దింపారు. ఇదే ఇప్పుడు కేసీఆర్కు ప్రాణసంకటంగా మారిందని అంటున్నారు.
పిడమర్తి రవి గతంలో ఎన్నికల్లో పోటీ చేసి కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. దీంతో ఇలాంటి నాయకుడిని తమ నెత్తిన రుద్దారాని కిందిస్థాయి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ టికెట్ తనకే వస్తుందని భావించిన డాక్టర్ దయానంద్ తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో ఇప్పుడు రవికి ప్రచారం చేయడం ఆయనకు ఇష్టం లేదు., దీంతో ఈపరిణామాలను నెగ్గుకు రావడం అధికార పార్టీకి అంత ఈజీకాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోపక్క, టీఆర్ ఎస్ నుంచి దిగువ శ్రేణి నాయకులు పార్టీ కి దూరమవుతున్నారు. వాస్తవానికి సాధారణ ఎన్నికల సమయంలో దిగువ శ్రేణి నాయకులే పార్టీలకు ప్రధానం. కానీ, టీఆర్ ఎస్కు ఇప్పుడు సత్తుపల్లిలో ఉన్న దిగువ శ్రేణి నాయకులు దూరమవుతున్నారు. ఈ పరిణామం.. కూడా కేసీఆర్కు మింగుడు పడడం లేదని అంటున్నారు. మరి పిడమర్తి రవి ఎలా నెగ్గుకు వస్తారో చూడాలి.