ఇప్పుడు భారత దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది శబరిమల అయ్యప్ప దర్శనం ఆడవారుకి కల్పించడం. కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహిళలను ఎలాగైనా శబరిమల ఆలయంలోకి తీసుకెళ్లాలని కేరళ ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సమీపంలోకి వచ్చిన ఇద్దరు మహిళలు స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. అయితే ఆ మహిళలను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు అక్కడ సమీపించడంతో పెద్ద గొడవ జరగుతుందని వారిని వెనక్కి పంపించారు. అంతేకాదు మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే తాము ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ అర్చకులు ప్రకటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు తమ వల్ల ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతో ఆ ఇద్దరూ మహిళలు కూడ ఆలయంలోకి ప్రవేశించకుండానే వెనుదిరిగారు. తాజాగా కేరళా ప్రభుత్వం మహిళలను ఎలాగైనా దర్శించుకునేలా చేసేందుకు కన్నింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మహిళా భక్తులను పురుషుల వేషధారణలో ఎవరికీ అనుమానం రాకుండా ఆలయంలోకి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ప్లాన్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, శబరిమలలో ఉన్న భక్తులను, మీడియా ప్రతినిధులను ఖాళీ చేయాల్సిందిగా సోమవారం ఆదేశించిన ప్రభుత్వం రాత్రివేళ ఈ ఆపరేషన్ చేపట్టాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు.
ఈ విషయం బయటకు పొక్కకుండా జామర్లను ఏర్పాటు చేస్తోందని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే..ఈనెల 18న అయ్యప్ప ఆలయాన్ని తెరిచి సోమవారం మూసివేశారు. చివరి రోజున స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరిన దళిత కార్యకర్త బిందును పంబ వరకు రాకుండానే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే కాదు ఇలాంటి కార్యక్రమాలకు కేరళా ప్రభుత్వం స్వస్తి పలకాలని హెచ్చరించారు. కాగా, శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లను ఎప్పుడు విచారించేదీ సుప్రీంకోర్టు నేడు నిర్ణయించనుంది.